
చర్యలు తీసుకోవాలని గవర్నర్కు మాల మహానాడు వినతి
పీఆర్సీపై సప్పుడు లేదు
ముగిసిన ‘నివేదిక’ గడువు
సర్కారు నుంచి నో రెస్పాన్స్
ఎదురు చూస్తున్న ఉద్యోగులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధులు పక్కదోవ పడుతున్నాయని.. వాటిని ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి వినియోగించేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ తమిళిసైకి మాల మహానాడు విజ్ఞప్తి చేసింది. సంఘం జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య బుధవారం రాజ్భవన్లో గవర్నర్ ను కలిసి లేఖ ఇచ్చారు. గత ఏడాది ఎస్సీలకు 57 కోట్లు కేటాయించారని, అందులో 23 కోట్లు పక్కదోవ పట్టాయని ఆరోపించారు. తెలంగాణ ఏర్పాటయ్యాక ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద 10,406 కేసులు నమోదయ్యాయన్నారు. ఎస్సీ, ఎస్టీలపై దాడులు జరగకుండా అరికట్టాలని గవర్నర్ను కోరినట్టు తెలిపారు. ఎస్సీల జనాభా ఆధారంగా రిజర్వేషన్లను పెంచాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన సివిల్ సర్వెంట్లను ప్రాధాన్యమున్న పోస్టుల్లో నియమించాలని కోరారు. గవర్నర్ను కలిసిన వారిలో సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జంగ శ్రీనివాస్, జాతీయ ప్రధాన కార్యదర్శి వడాల భాస్కర్, మహిళా విభాగం కార్యదర్శి చంద్రలేఖ ఉన్నారు.
హైదరాబాద్, వెలుగు: వేతన సవరణ (పీఆర్సీ) కోసం ప్రభుత్వోద్యోగులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. పీఆర్సీపై సర్కారు ఎప్పుడు ప్రకటన చేస్తుందా అని వేచి చూస్తున్నారు. సవరణపై కమిటీకి ఇచ్చిన గడవు ముగిసి వారం కావొస్తున్నా సర్కారు నుంచి పిలుపు రాకపోవడంతో ఏం జరుగుతోందని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. ప్రభుత్వం నివేదిక కోరితే సీఎం చర్చలకు పిలుస్తారని ఆశగా ఉన్నారు.
ఎంతిస్తరో?
పీఆర్సీ నివేదికను పది, పన్నెండు రోజుల్లో అందజేయాలని కమిటీని ప్రభుత్వం ఈ నెల 10న ఆదేశించింది. ఈ గడువు ఈ నెల 22తో ముగిసింది. కమిటీ కూడా నివేదికను రెడీ చేసినట్టు తెలుస్తోంది. అయితే ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాకపోవటంతో వాళ్లు వేచి చూస్తున్నట్లు సమాచారం. నివేదిక ప్రభుత్వానికి చేరితే తమను సీఎం కేసీఆర్ చర్చలకు ఆహ్వానిస్తారని ఉద్యోగులు అనుకుంటున్నారు. మీటింగ్లో పెండింగ్ సమస్యలనూ సీఎం దృష్టికి తీసుకెళ్లొచ్చని భావిస్తున్నారు. ఐఆర్ ఇస్తారా లేక డైరెక్ట్గా పీఆర్సీ ప్రకటిస్తరా.. ఇస్తే ఎంతిస్తరోనని ఉద్యోగుల్లో 15 రోజులుగా చర్చ జరుగుతోంది. పీఆర్సీ నివేదికివ్వాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించాక కమిటీతో ఆర్థిక శాఖ అధికారులు భేటీ అయ్యారు. వీళ్లంతా కమిటీ నివేదిక, సిఫార్సులు, ఫిట్మెంట్, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, నిధుల కొరతపై చర్చించినట్లు తెలిసింది. ఫిట్మెంట్ ఎంతిస్తే ఎంత భారం పడుతుందో కమిటీకి ఆర్థిక శాఖ అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది.
గతేడాది మేలో కమిటీ
పీఆర్సీపై గతేడాది మే నెలలో చైర్మన్ సీఆర్ బిశ్వాల్, సభ్యులు ఉమామహేశ్వరావు, మహ్మద్ ఆలీ రఫత్లతో ప్రభుత్వం కమిటీ వేసింది. మామూలుగా ఒకే అధికారితో కమిటీ వేస్తుంటారు. కానీ నివేదిక తొందరగా అందించాలని ఈసారి ముగ్గురు రిటైర్డ్ ఐఏఎస్లతో కమిటీ వేశారు. ఏడాదిన్నర నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, పెన్షనర్లతో కమిటీ చర్చించింది. ప్రతిపాదనలు తీసుకుంది. వాటిని అధ్యయనం చేసి సిఫార్సుల నివేదికను రూపొందించినట్లు తెలుస్తోంది.
ఆర్టీసీ సమ్మె కొలిక్కి రావడంతో..
52 రోజులుగా చేస్తున్న సమ్మెను విరమిస్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ నేతలు ప్రకటించారు. విధుల్లో చేరేందుకు సిద్ధమన్నారు. ప్రభుత్వమూ కార్మికులను విధుల్లోకి తీసుకునే అంశాన్ని పరిశీలిస్తోంది. దీంతో ఇక పీఆర్సీ నివేదికను త్వరలోనే ప్రభుత్వం అడిగే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం కోరితే ఇచ్చేందుకు నివేదిక ఇచ్చేందుకు సిద్ధమని కమిటీలోని ఓ అధికారి తెలిపారు.