
- విద్యార్థులపై ఎస్సీ గురుకుల సెక్రటరీ అలుగు వర్షిణి కామెంట్స్
- వారం కిందటి ఆడియో క్లిప్ వైరల్
- కావాలనే కాంట్రవర్సీ చేస్తున్నారన్న సెక్రటరీ
హైదరాబాద్, వెలుగు: ఎస్సీ గురుకుల సొసైటీ సెక్రటరీ అలుగు వర్షిణి ఇటీవల ఓ ఆడియోలో మాట్లాడిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. “గురుకుల పాఠశాలల్లో చదివే విద్యార్థులు టాయిలెట్లు కడగడం, ఎవరి రూమ్ వాళ్లే క్లీన్ చేసుకోవటంలో తప్పేంటి. ఎవరొచ్చి చేస్తరు. గురుకులాల పిల్లలు పోష్ ఫ్యామిలీ నుంచి రాలేదు. వాళ్ల టేబుల్ మీదకి ఫుడ్ రాదు. రోటీలు చేయాల్సిందే. నేర్చుకుంటరు కదా” అని వ్యాఖ్యానించారు. వారం క్రితం చేసిన ఈ వ్యాఖ్యలు బుధవారం వెలుగులోకి వచ్చాయి. సెక్రటరీ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. గురుకుల విద్యార్థుల పట్ల అవమానకరంగా, కుల వివక్షను ప్రోత్సహించేలా ఉన్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. విద్యార్థులతో టాయిలెట్లు కడిగించడం, వంటలు చేయించడం వంటివి కుల వివక్షకు సంబంధించినవని, ఇది శ్రమ గౌరవాన్ని నేర్పడం కంటే వెట్టిచాకిరికి సమానమని విమర్శిస్తున్నారు.
ఆ ఐఏఎస్ను విధుల నుంచి తొలగించాలి: కవిత
‘‘దళిత బిడ్డలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకంత వివక్ష. ఎస్సీ గురుకులాల్లో టాయిలెట్లు, హాస్టల్ గదులను విద్యార్థులతో క్లీన్ చేయించాలని ఆదేశాలు ఇచ్చిన ఐఏఎస్ ఆఫీసర్ను విధుల నుంచి తొలగించి చర్యలు తీసుకోవాలి’’ అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బుధవారం ప్రకటన విడుదల చేశారు. గురుకులాల్లో శానిటేషన్, స్వీపింగ్ పనులు చేసే వర్కర్స్ ను తొలగించారని, ఎందుకలా చేశారని ఆమె ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కో గురుకులానికి నెలకు శానిటేషన్, స్వీపింగ్ పనులు చేయడానికి రూ.40 వేల చొప్పున నిధులు ఇచ్చేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నెల నుంచి ఆ నిధుల విడుదలను ఆపేసిందని కవిత దుయ్యబట్టారు.
స్టూడెంట్లపై రాజకీయాలు వద్దు: అలుగు వర్షిణి
వారం క్రితం తాను ప్రిన్సిపాల్స్ తో మాట్లాడిన వ్యాఖ్యలను రాజకీయం చేస్తున్నారని సెక్రటరీ అలుగు వర్షిణి అన్నారు. గురుకుల స్టూడెంట్లకు సీఎం ప్రతిభా పురస్కారాలు అందజేసిన రోజే ఆడియో క్లిప్ బయటపెట్టి కాంట్రవర్సీ చేస్తున్నారని తెలిపారు. స్టూడెంట్ల విషయంలో రాజకీయాలు చేయెద్దని ఆమె బుధవారం ఈ మేరకు ఒక ప్రకటనలో వివరణ ఇచ్చారు. ప్రతి గురుకులంలో శానిటేషన్ కు నెలకు రూ.40 వేలు ఖర్చు చేస్తున్నామని, శానిటేషన్ కార్మికులను ఎవరినీ తొలగించటం లేదని, పిల్లలతో పనులు చేయించడం లేదన్నారు. టాయిలెట్స్, లైట్స్ రిపేర్లు చేయటానికి జోనల్ ఆఫీసర్ల అకౌంట్ లో రూ.10 లక్షలు ఉన్నాయన్నారు. ఎవరి పని వాళ్లు చేసుకుంటే తప్పేం లేదన్న ఉద్దేశంతోనే తాను మాట్లాడానన్నారు.