
న్యూఢిల్లీ: ప్రధాని మోడీ పంజాబ్ పర్యటనలో భద్రతా వైఫల్యాలపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. మోడీ పర్యటనకు సంబంధించిన ఫుటేజీలను భద్రపర్చాలని పంజాబ్, హరియాణా రిజిస్ట్రార్ జనరల్ కు అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తుపై చండీగఢ్ డైరెక్టర్ జనరల్, నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అధికారి నోడల్ ఆఫీసర్లుగా వ్యవహరించాలని కోర్టు సూచించింది. సోమవారం వరకు కేంద్ర, రాష్ట్ర విచారణ కమిటీలు దర్యాప్తు కొనసాగించాలని జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది.
కాగా, అంతకు ముందు రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. ప్రధాని భద్రతా విషయాన్ని పంజాబ్ సర్కారు తేలికగా తీసుకోలేదని తెలిపారు. ఘటన జరిగిన రోజే విచారణ కమిటీని ఏర్పాటు చేశామని కోర్టుకు తెలిపారు. స్వతంత్ర కమిటీతో ఇన్వెస్టిగేషన్ జరుగుతోందని.. అన్ని విషయాలు త్వరలో వెలుగులోకి వస్తాయన్నారు. ఘటన వెనక ఉగ్రవాద హస్తాన్ని తోసిపుచ్చలేమని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు. కేంద్రం కూడా కమిటీ ఏర్పాటు చేసిందని.. రాష్ట్రాలకు నోటీసులు జారీ చేశామని అటార్నీ జనరల్ వేణుగోపాల్ అన్నారు. అన్ని విషయాలు, రికార్డులు కోర్టు ఎదుట శనివారం సమర్పిస్తామని తెలిపారు. కేసును సోమవారం వరకు వాయిదా వేయాలని తుషార్ మెహతా కోర్టును కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విచారణ కొనసాగిస్తున్నాయని.. కోర్టు ఆదేశాల మేరకు నడుచుకుంటామని పంజాబ్ అడ్వకేట్ జనరల్ చెప్పారు. దీంతో సుప్రీంకోర్టు కేసును సోమవారానికి వాయిదా వేసింది.
మరిన్ని వార్తల కోసం: