
హైదరాబాద్ కుషాయిగూడలో ఘోరం జరిగింది.. సైకిల్ పై వెళ్తున్న స్టూడెంట్ ను అదే స్కూల్ బస్సు ఢీకొనడంతో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం ( జులై 11 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్షర స్కూల్ కు చెందిన చైతన్య అనే విద్యార్థిని అదే స్కూల్ బస్సు ఢీకొనడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.
ప్రమాదానికి కారణమైన డ్రైవర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. తీవ్ర గాయాలైన విద్యార్థిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రమాదానికి కారణమైన డ్రైవర్ కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు విద్యార్ధి తల్లిదండ్రులు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. బుధవారం ( జులై 10 ) సంగారెడ్డి జిల్లాలో స్కూల్ బస్సులో మంటలు రావటం కలకలం సృష్టించింది. విద్యార్థులను ఎక్కించుకుంటున్న సమయంలో బస్సులో మంటలు చెలరేగటంతో ఆందోళనకు గురయ్యారు విద్యార్థులు, టీచర్లు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది పిల్లలను బస్సులోనుంచి బయటకు దించారు. దీంతో ఘోర ప్రమాదం తప్పింది.
►ALSO READ | వామ్మో.. కరీంనగర్ పబ్లిక్ జర జాగ్రత్త.. సీసీ కెమెరాల్లో ఏం రికార్డయిందో చూడండి..!
కిష్టారెడ్డిపేటలో విద్యార్థులను ఎక్కించుకుంటుండగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బస్సులో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో విద్యార్థులు బస్సులోనే ఉండటం ఆందోళన కలిగించింది. పిల్లలను ఎక్కించుకునే క్రమంలో కింద స్పార్క్ వచ్చి మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ హుటాహుటిన బస్సులో నుంచి పిల్లలను కిందకు దించేశాడు.
మంటలు మెల్ల మెల్లగా వ్యాపించడంతో బస్సు పాక్షికంగా దగ్ధమయినట్లు ఫైర్ సిబ్బంది తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అర్పివేశారు. ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.