బడి బస్సులు భద్రమేనా? ....స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న ఆర్టీఏ

బడి బస్సులు భద్రమేనా? ....స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న ఆర్టీఏ
  • ఫిట్​నెస్​ టెస్టులకు వచ్చింది సగం వాహనాలే..
  •  రూల్స్​ పాటించక రోడ్లపై తిరుగుతున్నవి  5 వేలకు పైనే 
  • ఇప్పటికే 350 బస్సులపై కేసులు

హైదరాబాద్​సిటీ, వెలుగు: గ్రేటర్​పరిధిలో స్కూల్​బస్సుల ఫిట్​నెస్​పై ఆయా విద్యాసంస్థల యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. విద్యాసంస్థలు తెరిచే ముందే తమ వాహనాలను ఫిట్నెస్ టెస్టుకు తీసుకురావాల్సిందిగా నోటీసులు జారీ చేస్తే, 50 శాతం మాత్రమే ఫిట్ నెస్​టెస్టులు చేయించుకుని సర్టిఫికెట్లు పొందారని అధికారులు చెప్తున్నారు. హైదరాబాద్ పరిధిలో1300 వాహనాలు ఉంటే  775, రంగారెడ్డిలో 6200 వాహనాలకు 4500 , మేడ్చల్ పరిధిలో 6100 వెహికల్స్​కు 3200 మంది  సర్టిఫికెట్లు పొందారని చెప్తున్నారు.  

సగం వాహనాలకే ఫిట్​నెస్​సర్టిఫికెట్లు తీసుకోవడంతో వారం రోజులుగా స్కూల్​ బస్సులపై ఆర్టీఏ స్పెషల్​డ్రైవ్​నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే కొన్ని వందల బస్సులపై కేసులు నమోదు చేశామని, కొన్ని వాహనాలను సీజ్​చేసినట్టు అధికారులు తెలిపారు. గ్రేటర్​లో తిరుగుతున్న స్కూల్​బస్సుల్లో 15 ఏండ్లు పూర్తయినవి కూడా చాలా ఉన్నాయని అంటున్నారు. అయితే, కొందరు ఆఫీసర్లు స్కూల్​యాజమాన్యాల నుంచి ముడుపులు తీసుకుని చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని, అందుకే అనేక విద్యాసంస్థలు ఫిట్​నెస్​ లేకపోయినా ధీమాగా బస్సులను రోడ్లపై తిప్పుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.  

రూల్స్​పాటిస్తలేరు..అందుకే 

విద్యాసంస్థల వాహనాలు ఫిట్​నెస్​సర్టిఫికెట్​పొందాలంటే కొన్ని ప్రమాణాలు తప్పని సరిగా పాటించాలి. వాహనాల్లో స్టూడెంట్స్​సులభంగా ఎక్కి దిగడానికి మెట్ల అమరిక ఉండాలి. కిటికీల నుంచి చేతులు, తల బయట పెట్టకుండా జాలీలు ఏర్పాటు చేయాలి. బస్సులో ఫైర్​సేఫ్టీ పరికరాలు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉండాలి. వెహికల్స్​కు తప్పకుండా ఇన్సూరెన్స్​ చేయించాలి. ఆర్టీఏకు పన్ను చెల్లించి ఉండాలి. బస్సు నడిపే డ్రైవర్ 60 ఏళ్ల లోపు వారై ఉండాలి. 15 ఏండ్లు దాటిన వాహనాలు రోడ్లపై తిప్పకూడదు. అయితే, ఇందులో చాలా నిబంధనలు పాటించడం లేదు కాబట్టే విద్యాసంస్థల యాజమాన్యాలు ఫిట్​నెస్​ టెస్టుకు రావడం లేదని తెలుస్తోంది. యాజమాన్యాలకు నోటీసులు ఇస్తున్నామని, రూల్స్​పాటించకపోతే సీజ్​చేస్తామని ఆర్టీఏ అధికారులు హెచ్చరిస్తున్నారు. 

349 కేసుల నమోదు

గ్రేటర్​పరిధిలో ఫిట్​నెస్​ లేని స్కూల్​బస్సులన్నీ గుర్తించేంత వరకు స్పెషల్​ డ్రైవ్​ కొనసాగుతుందని ఆర్టీఏ అధికారులు తెలిపారు. గ్రేటర్​పరిధిలో మంగళవారం నాటికి 160 కేసులు నమోదు చేయగా బుధవారం, గురువారం కలిపి మరో 189 కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. ఈ రెండు రోజుల్లో 1,223 వాహనాలను తనిఖీ చేశామన్నారు. ఇందులో 66 వాహనాల పత్రాలు సరిగ్గా లేవని, 199 వాహనాలపై రిఫ్లెక్టివ్​టేప్స్​లేవని గుర్తించినట్టు చెప్పారు. వీరి నుంచి కాంపౌండింగ్​ ఫీజుల కింద రూ1.26 లక్షలు వసూలు చేసినట్టు అధికారులు తెలిపారు.