
జూన్ 21న యోగ దినోత్సవం సందర్భంగా ఏపీలో యోగాంధ్ర పేరుతో ఘనంగా నిర్వహిచింది కూటమి సర్కార్. వైజాగ్ భారీ ఏర్పాట్ల మధ్య సాగిన యోగాంధ్ర కార్యక్రమానికి ప్రధాని మోడీ కూడా హాజరైన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం గిన్నిస్ బుక్ రికార్డ్ లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా 2 కోట్ల మంది ఈ కార్యక్రమంలో పాల్గొనేలా ప్లాన్ చేసింది. ఇందుకోసం స్కూళ్ళు, గవర్నమెంట్ ఆఫీసులు అన్ని చోట్ల ఉదయం 6 గంటలకే యోగాలో పాల్గొనాలని ఆదేశాలు జారీ చేసింది ప్రబుత్వం. అయితే.. ప్రభుత్వ ఆదేశాలను వ్యతిరేకిస్తూ ఓ హెడ్ మాస్టర్ రాజీనామా చేయడం సంచలనంగా మారింది. ఆరేళ్ళ పిల్లలు పొద్దునే 6 గంటలకు బడికి ఎలా వస్తారని ప్రశ్నిస్తూ రాజీనామా చేశారు సదరు హెడ్ మాస్టర్. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.
నెల్లూరు జిల్లాలోని కోటితీర్థంలో ఎంపీపీ స్కూల్లో హెడ్ మాస్టర్ గా పని చేస్తున్న మధుసూధన్ రావు ప్రభుత్వ ఆదేశాలను వ్యతిరేకిస్తూ రాజీనామా చేయడం సంచలనం రేపుతోంది. తన 29 ఏళ్ళ సర్వీసులో ఇంతటి బానిసత్వం ఎన్నడూ చూడలేదని తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు మధుసూదన్ రావు. ఆచరణ యోగ్యం కానీ ఉదయం 6 గంటలకే 6 సంవత్సరాల పిల్లల యోగా కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు మధుసూదన్ రావు.
అంతే కాకుండా.. తన రాజీనామా లేఖలో విద్యాశాఖపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు మధుసూదన్ రావు. ఈ మధ్య విద్యాశాఖ వింత పోకడలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయని.. ఆప్ ల పేరుతో వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు మధుసూదన్ రావు. ఆప్స్ సరిగా పనిచేయకపోయినా ఐటీ సెల్ మీద చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని ప్రశ్నించారు మధుసూదన్ రావు. ఉదయం 6 గంటలకే 6 ఏళ్ళ పిల్లలు బడికి ఎలా వస్తారంటూ ప్రశ్నించారు మధుసూదన్ రావు.పిల్లలతో బలవంతంగా యోగాసనాలు వేయించాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మదుసూధన్ రావు.
మహిళా ఉపాధ్యాయులు ఉదయం 6 గంటలకే స్కూల్ కి రావడం సాధ్యమవుతుందా.. భద్రత మీరు కల్పిస్తారా అంటూ ప్రశ్నించారు. ఇలాంటి పిచ్చి చేష్టలతో విద్యాశాఖ నవ్వులపాలవుతోందని అన్నారు. దీంతో పాటు విద్యాశాఖలో జరుగుతున్న అవకతవకలను కూడా రాజీనామా లేఖలో ఎండగట్టారు మధుసూదన్ రావు. తాను స్వచ్ఛందంగా పదవి విరమణ ప్రకటిస్తున్నానంటూ లేఖ రాశారు మధుసూదన్ రావు. కూటమి సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వ స్కూల్ హెడ్ మాస్టర్ రాజీనామా చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.