- అమెరికాలోని ఓక్లహోమాలో ఘటన
ఓక్లహోమ: మిస్సయిన ఇద్దరు అమ్మాయిల కోసం వెతుకుతుండగా పోలీసులకు ఏడుగురి డెడ్బాడీలు లభ్యమయ్యాయి. అమెరికా ఓక్లహోమా సిటీకి దగ్గర్లోని హెన్రియెట్టా టౌన్లో డెడ్బాడీలు దొరికినట్లు స్టేట్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు మంగళవారం తెలిపారు. ఇద్దరు టీనేజీ అమ్మాయిలు కనిపించకుండాపోయారంటూ వాళ్ల కుటుంబ సభ్యులు శనివారం ఫిర్యాదు చేశారు. దీంతో సెర్చింగ్ మొదలు పెట్టిన పోలీసులకు ఆ ఇద్దరు అమ్మాయిల డెడ్బాడీలతో పాటు, ఇంకో ఐదుగురి మృతదేహాలు కనిపించాయి.
రేపిస్ట్తో వెళ్లిన టీనేజర్లు..
రేప్ కేసులో జైలు శిక్ష అనుభవించి విడుదలైన జెస్సీ మెక్ఫాడెన్(39) అనే వ్యక్తితో ఈ ఇద్దరు అమ్మాయిలు ఐవీ వెబ్స్టర్(14), బ్రిటనీ బ్రూవర్(16) వెళ్లినట్లు పోలీసులు అనుమానించారు. మెక్ ఫాడెన్ సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసుకుని వాళ్లను ట్రాప్ చేశాడని గుర్తించి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. హెన్రియెట్టా టౌన్లోనే ఈ ఇద్దరు అమ్మాయిలు మెక్ఫాడెన్తో కలిసి కారులో వెళ్తున్నట్లు హైవే పెట్రోలింగ్ డిపార్ట్ మెంట్ సమాచారం ఇచ్చింది. వాళ్లను గాలిస్తూ వెళ్లిన అధికారులు మెక్ ఫాడెన్ ఇంటిదగ్గర్లోనే ఏడుగురి డెడ్బాడీలను గుర్తించారు. అందులో మూడు మృతదేహాలు వెబ్స్టర్, బ్రూవర్, మెక్ఫాడెన్వని తేల్చారు. మిగతా నాలుగు డెడ్బాడీల వివరాల కోసం ఆరా తీస్తున్నారు. ఈ ఏడుగురు ఎలా చనిపోయారనేదానిపైనా దర్యాప్తు చేస్తున్నారు. ‘‘2003లో రేప్ కేసులో మెక్ ఫాడెన్కు జైలు శిక్ష పడింది. అతను 2020 అక్టోబర్లో విడుదలయ్యాడు”అని పోలీసులు తెలిపారు. బ్రిటనీ బ్రూవర్ మిస్ హెన్రియెట్టాగా ఎంపికైందని, జులైలో జరగనున్న మిస్ నేషనల్ పోటీకి వెళ్లాల్సి ఉందని ఆమె తల్లిదండ్రులు వెల్లడించారు.
