
న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) ఈక్విటీ డెరివేటివ్స్ కాంట్రాక్టుల గడువు ముగింపు తేదీని మంగళవారానికి మార్చడానికి సెబీ ఆమోదం పొందింది. బీఎస్ఈకి గురువారం గడువు ముగింపు తేదీగా కేటాయించింది. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం, ఎన్ఎస్ఈ ఎఫ్అండ్ఓ (ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్) గడువు ముగింపును గురువారాల్లో, బీఎస్ఈ మంగళవారాల్లో నిర్వహిస్తోంది. కొత్త షెడ్యూల్ సెప్టెంబర్ 1, 2025న లేదా ఆ తర్వాత గడువు ముగిసే అన్ని కొత్త ఈక్విటీ డెరివేటివ్స్ కాంట్రాక్టులకు వర్తిస్తుంది.
ఈ తేదీకి ముందు గడువు ముగిసే కాంట్రాక్టులు ఇప్పటికే ఉన్న గడువు ముగింపు షెడ్యూల్ ప్రకారం ఉంటాయి. దీర్ఘకాలిక ఇండెక్స్ ఆప్షన్స్ కాంట్రాక్టులకు మినహా, ఇప్పటికే ప్రవేశపెట్టిన కాంట్రాక్టుల కోసం డెరివేటివ్స్ కాంట్రాక్టుల గడువు ముగింపు తేదీని మార్చకుండా ఉంచుతామని ఎక్స్ఛేంజీలు తెలిపాయి.