
న్యూఢిల్లీ: రిటైల్ ఇన్వెస్టర్లను సైబర్ మోసాల నుంచి కాపాడేందుకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ ) సెబీ చెక్ అనే కొత్త టూల్ను అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది. సెక్యూరిటీస్ మార్కెట్ ట్రాన్సాక్షన్స్లో ఉపయోగించే యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) అడ్రస్లు సరియైనవా? కాదా? అని ఇది నిర్ధారిస్తుంది. సెబీ చెక్ ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి అందుబాటులోకి వస్తుంది. ఇన్వెస్టర్లు పేమెంట్స్ చేసే ముందు సెబీ- రిజిస్టర్డ్ ఇంటర్మీడియరీల (బ్యాంక్స్, బ్రోకర్స్, ఇతర ఆథరైజ్డ్ ఎంటిటీస్) యూపీఐ హ్యాండిల్స్ను వెరిఫై చేయొచ్చు. డబ్బు కేవలం వెరిఫైడ్ ఎంటిటీస్కే వెళ్తుందని సెబీ చెక్ ద్వారా తెలుస్తుంది.
సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే మాట్లాడుతూ, “యూపీఐ అడ్రస్ సరైనదా? కాదా? బ్యాంక్, బ్రోకర్ లాంటి రిజిస్టర్డ్ ఎంటిటీదేనా? అని చెక్ చేసే సిస్టమ్ను త్వరలో ప్రవేశపెడతాం. ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అక్టోబర్ 1 నుంచి ఇది స్టార్ట్ అవుతుంది. సైబర్ మోసాలపై ఆందోళన పెరుగుతోంది. దీనిని తగిన పద్ధతిలో పరిష్కరించాలి. ఇప్పుడు మన దగ్గర 13 కోట్ట యూనిక్ ఇన్వెస్టర్లు ఉన్నారు. సెక్యూరిటీస్ మార్కెట్లో వాళ్లు సరైన ప్లేస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారని తెలుసుకునే సిస్టమ్ కావాలి” అని వివరించారు. ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్, రీసెర్చ్ అనలిస్ట్స్, బ్రోకర్స్ వంటి వాళ్లు అక్టోబర్ 1 నాటికి ఈ కొత్త యూపీఐ వెరిఫికేషన్ సిస్టమ్కు మారాలి. సుమారు 9,000 సెబీ -రిజిస్టర్డ్ ఇంటర్మీడియరీలు ఈ సిస్టమ్ను వాడతాయని అంచనా.
ఎక్కడ ఉపయోగం?
ఐపీఓలు, మ్యూచువల్ ఫండ్స్, ఇతర ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్లలో యూపీఐ ట్రాన్సాక్షన్స్కు ఈ వెరిఫికేషన్ ఫీచర్ సేఫ్టీగా పనిచేస్తుంది. డబ్బు ఫ్రాడ్ అకౌంట్స్కు వెళ్లకుండా చూస్తుంది.