- పాల్గొననున్న ఖర్గే, రాహుల్, ప్రియాంక, డీకే శివకుమార్
- 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్న నేతలు
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ రెండో విడత విజయభేరి బస్సు యాత్ర శనివారం నుంచి ప్రారంభం కానుంది. నవంబర్ 2వ తేదీ వరకు ఆరు రోజుల పాటు సాగనుంది. రెండో విడతలో 7 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ జాతీయ స్థాయి నాయకులు ప్రచారం చేయనున్నారు. 28న (శనివారం) కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్లోని తాండూరు, పరిగి, చేవెళ్ల, 29న ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే మెదక్ లోక్సభ సెగ్మెంట్లోని సంగారెడ్డి, నర్సాపూర్, మెదక్లో బస్సు యాత్రలో పాల్గొనున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ 30న భువనగరి పార్లమెంట్ సెగ్మెంట్లోని జనగామ, ఆలేరు, భువనగిరి, 31న నల్గొండ పార్లమెంట్ సెగ్మెంట్లోని నాగార్జునసాగర్, నాగర్కర్నూల్ సెగ్మెంట్లోని కొల్లాపూర్లో బస్సు యాత్ర నిర్వహిస్తారు. రాహుల్ గాంధీ నవంబర్ 1న నాగర్కర్నూల్ పార్లమెంట్ సెగ్మెంట్లోని కల్వకుర్తి, మహబూబ్నగర్ సెగ్మెంట్లోని జడ్చర్ల, షాద్నగర్, నవంబర్ 2న మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని మేడ్చల్, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి నియోజకవర్గాల పరిధిలో నిర్వహించే బస్సు యాత్రల్లో పాల్గొంటారు.
రాష్ట్రంలోని సమస్యలపై గ్రీవెన్స్ కలెక్షన్ క్యాంపెయిన్
రెండో విడత బస్సు యాత్రలో రాష్ట్రంలోని సమస్యలపై ‘గ్రీవెన్స్ కలెక్షన్’ పేరిట కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా ఓ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఇందులో భాగంగా ప్రతి జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల్లో గ్రీవెన్స్ బాక్సులను ఏర్పాటు చేసి.. ఆయా సెగ్మెంట్లలో ఉన్న సమస్యలను ప్రజల ద్వారా అడిగి తెలుసుకోనుంది. ప్రజలు తమ సమస్యలను చిట్టీలో రాసి ఆ గ్రీవెన్స్ బాక్సులో వేసేలా కార్యక్రమాన్ని రూపొందించింది. అంతేకాకుండా ఫోన్లలో సమస్యలు చెప్పుకునేందుకు ఓ టోల్ ఫ్రీ నంబర్నూ ఏర్పాటు చేయనుంది.