గుండెగాం పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది : బండి సంజయ్

 గుండెగాం పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది : బండి సంజయ్

నిర్మల్ జిల్లాలోని గుండెగాం పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. గుండెగాం ప్రజలు ఏం పాపం చేశారు..? ఏటా ఊరు మునిగిపోతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదు..? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్లినా కష్టాలు, కన్నీళ్లే కనిపిస్తున్నాయని, తెలంగాణను ముఖ్యమంత్రి కేసీఆర్ సర్వనాశనం చేస్తున్నారని ఆరోపించారు. ఇక్కడ సొమ్మును పంజాబ్ కు పంచి పెడుతూ.. రాష్ట్ర ప్రజల బతుకులను గాలి కొదిలేస్తారా..? అని నిలదీశారు. ఈసారి వర్షాలు వచ్చి గ్రామం ముంపునకు గురైతే టీఆర్ఎస్ నేతలను తీసుకొచ్చి గ్రామంలో కట్టేయండి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుండెగాం బాధితులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. 

డబుల్ బెడ్రూం ఇండ్లు పూర్తికాక ముందే చిన్నపాటి వర్షానికే కురుస్తున్నాయని బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ పాలనలో పిల్లల్ని కనాలంటేనే భయపడుతున్నారని, పుట్టబోయే బిడ్డపైనా రూ. 1.2 లక్షల అప్పు చేశారని విమర్శించారు. కేసీఆర్ కు పేదలంటే మంట అని, కేసులు పెట్టి వేధిస్తూనే ఉంటారని అన్నారు. పేదలకు బీజేపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కేసీఆర్ సంగతి చూస్తామని, బీజేపీ అధికారంలోకి రాగానే గుండెగాంను అద్దంలా మెరిపిస్తామని హామీ ఇచ్చారు. గుండెగాంలో 250 కుటుంబాలనే కాపాడలేనోడు..తెలంగాణను ఏం కాపాడుతారని విమర్శలు గుప్పించారు. ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని, రాష్ట్రాన్ని రూ.5 లక్షల కోట్ల అప్పుల పాలు చేశారని ఆరోపించారు. 

పేదోళ్ల జాగాలలోనే పోలీస్ స్టేషన్లు, ఫైర్ స్టేషన్లు కడుతున్నారని బండి సంజయ్ చెప్పారు. కమీషన్ల కోసం టీఆర్ఎస్ నేతలు గద్దల్లా వాలిపోతారని, గుండెగాం ప్రజల సమస్య పరిష్కారం కోసం ఉధృత పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్ గుండెగాం గ్రామానికి రావాలని, లేనిపక్షాన గ్రామస్తులే కేసీఆర్ దగ్గరికి వెళ్లి, ఆయన సంగతి ఏందో చూస్తారన్నారు. ఉపాధి హామీ నిధులను కూడా కేసీఆర్ దారి మళ్లీస్తున్నారన్న బండి సంజయ్..రాష్ట్రంలో దోచుకున్న సొమ్మును పత్తాలు, డ్రగ్స్, ఢిల్లీ లిక్కర్ స్కాంలో పెడుతున్నారని ఆరోపించారు. మరో ఆరు నెలల తరువాత రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.