
హైదరాబాద్,వెలుగు : మిడిల్ క్లాస్, మైనార్టీ ప్రజలు ఎక్కువగా నివసించే అసెంబ్లీ సెగ్మెంట్ జూబ్లీహిల్స్. ప్రస్తుత ఎన్నికల్లో నాలుగు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, మజ్లిస్అభ్యర్థులు ఇక్కడి నుంచి పోటీలో నిలిచారు. అయితే.. ముస్లిం మైనార్టీల ఓట్లే గెలుపోటములను నిర్ణయిస్తాయి. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా జూబ్లీహిల్స్ సెగ్మెంట్ఏర్పాటైంది. తొలిసారి కాంగ్రెస్ నుంచి పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో టీడీపీ నుంచి, 2018లో బీఆర్ఎస్నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా మాగంటి గోపీనాథ్ విజయం సాధించారు.
ఈసారి హ్యాట్రిక్ కొట్టేందుకు ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈసారి కాంగ్రెస్ నుంచి విష్ణువర్ధన్ రెడ్డికి టికెట్ దక్కలేదు. మాజీ క్రికెటర్ అజారుద్దీన్ను బరిలోకి దించారు. మజ్లిస్ నుంచి షేక్ రషీద్ ఫరాదుద్దీన్, బీజేపీ నుంచి లంకల దీపక్రెడ్డి పోటీలో ఉన్నారు. నాలుగు పార్టీల అభ్యర్థులు బరిలోకి దిగినా ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే తీవ్ర పోటీ నెలకొంది.
వీరి ఓట్లు ఎవరికి పడ్డా వారిదే గెలుపు
జూబ్లీహిల్స్ సెగ్మెంట్ పరిధిలో మోతీనగర్, బోరబండ, కళ్యాణ్నగర్, టోలీ చౌక్ ప్రాంతాల్లో క్రిస్టియన్లు, సెటిలర్ ఓటర్లు ఎక్కువగా ఉండగా.. టోలీచౌక్, బోరబండ, షేక్పేట ప్రాంతాల్లో ముస్లింలు అధికంగా నివసిస్తుంటారు. వీరి ఓట్లను పొందేందుకు ఆయా పార్టీల అభ్యర్థులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈసారి సెగ్మెంట్లో కొత్తగా దాదాపు 50వేల మంది ఓటర్లు నమోదయ్యారు. వీరి ఓట్లు ఎవరికి పడ్డా వారి గెలుపు ఖాయమని చెప్పొచ్చు. అయితే ఈ ఎన్నికల్లో అభ్యర్థుల తలరాత మార్చే ముస్లిం మైనార్టీలు ఎటువైపు మొగ్గుతారనేది ఆసక్తిగా మారింది.
పథకాలు గెలిపిస్తయనే ధీమా
రెండుసార్లు గెలుపొందిన బీఆర్ఎస్ సిట్టింగ్ అభ్యర్థి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రభుత్వ సంక్షేమ పథకాలే గెలిపిస్తాయనే ధీమాతో ఉన్నారు. గోపీనాథ్మైనస్లకు వస్తే... ప్రజలకు అందుబాటులో ఉండరని, ఏదైనా ప్రభుత్వ కార్యక్రమం ఉంటే తప్ప కనిపించరనే వాదన ఉంది. పథకాలు పార్టీ కార్యకర్తలకే అందించారనే, తనకు వ్యతిరేకంగా ఉన్న వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడతారనే ఆరోపణలు ఉన్నాయి. .
మైనార్టీ ఓటర్లే టార్గెట్
కాంగ్రెస్అభ్యర్థి మాజీ క్రికెటర్అజారుద్దీన్ పోటీలో ఉండగా.. మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో వారి ఓట్లు తనకే పడతాయనే ధీమాతో ఉన్నారు. క్రికెటర్గా తనకున్న క్రేజ్కూడా కలిసొస్తుందని భావిస్తున్నారు. బీజేపీ నుంచి అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి పోటీలో ఉండగా.. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఓట్లు చీలితే తనకే లాభిస్తుందన్న ధీమాతో ఉన్నారు.
మరోసారి ఉనికిని చాటేందుకు
2014లో మజ్లిస్ పోటీ చేసినా మరోసారి తన ఉనికి చాటుకునేందుకు పార్టీ అభ్యర్థిని రంగంలోకి దింపింది. మజ్లిస్ అభ్యర్థిగా కార్పొరేటర్ రషీద్ ఫరాజుద్దీన్ పోటీలో ఉన్నారు. అయితే.. రాజకీయంగా బీఆర్ఎస్కు మేలు చేసేందుకు మజ్లిస్ ఇక్కడి నుంచి పోటీ చేస్తుందనే వాదన ఉంది. మైనార్టీ ఓట్లను చీల్చడం ద్వారా బీఆర్ఎస్కు లబ్ధి చేకూరుస్తుందని భావిస్తున్నారు. మజ్లిస్కు సెగ్మెంట్ ప్రజ్లలో సానుభూతి ఉందని, తప్పకుండా తనకు ఓట్లు వేస్తారన్న ధీమాతో ఆ పార్టీ అభ్యర్థి ఉన్నారు. పార్టీ అధినేత అసదుద్దీన్ఓవైసీ ప్రచారంతో తనకు కలిసి వస్తుందని ఆయన భావిస్తున్నారు.
సెగ్మెంట్ ఓటర్లు ఇలా..
మొత్తం 3,75,430
పురుషులు 1,98,204
మహిళలు 1,77,207
ట్రాన్స్ జెండర్లు 19