
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోకి పెట్టుబడులు మే నెలలో రూ. 19,013 కోట్లకు పడిపోయి, గత 13 నెలల్లోనే అత్యల్పస్థాయికి చేరుకున్నాయి. ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున పెట్టుబడులను వెనక్కి తీసుకోవడమే ఇందుకు కారణం. లార్జ్-క్యాప్, మిడ్-క్యాప్, స్మాల్-క్యాప్ ఫండ్స్లోకి నిధులు విపరీతంగా తగ్గాయి. ఈక్విటీ ఫండ్స్లోకి నిధులు తగ్గడం వరుసగా ఐదో నెల కావడం గమనార్హం.
ఏప్రిల్లో నమోదైన రూ. 24,269 కోట్ల ఇన్ఫ్లోతో పోలిస్తే, నెలవారీగా నికర నిధులలో దాదాపు 22 శాతం తగ్గుదల ఉంది. పరిస్థితి ఇలా ఉన్నప్పటికీ, మే నెల ఈక్విటీ- ఆధారిత పథకాలలో వరుసగా 51వ నెలలో ఇన్ఫ్లోలు కొనసాగాయి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ - (సిప్) పెట్టుబడులు తగ్గలేదు. మే నెలలో రికార్డు స్థాయిలో రూ. 26,688 కోట్ల ఇన్ఫ్లో ఉండగా, అంతకు ముందు నెలలో రూ. 26,632 కోట్లు వచ్చాయి.
మొత్తంగా, మ్యూచువల్ ఫండ్ పరిశ్రమకు ఏప్రిల్లో రూ. 2.77 లక్షల కోట్ల నిధులు రాగా, మే నెలలో రూ. 29 వేల కోట్లకు పైగా ఇన్ఫ్లో ఉంది. పరిశ్రమ నిర్వహణలోని ఆస్తుల విలువ (ఏయూఎం) ఏప్రిల్ చివరి నాటికి రూ. 70 లక్షల కోట్ల నుంచి మే చివరి నాటికి రికార్డు స్థాయిలో రూ. 72.2 లక్షల కోట్లకు పెరిగింది. ఈక్విటీ- ఆధారిత మ్యూచువల్ ఫండ్స్ స్కీముల్లోకి మే నెలలో రూ. 19,013 కోట్లు వచ్చాయి.
ఇది ఏప్రిల్ 2024 తర్వాత అత్యల్ప స్థాయి. అప్పుడు రూ. 18,917 కోట్ల నిధులు వచ్చాయి. అంతకు ముందు నెలల్లో అంటే.. ఏప్రిల్లో రూ. 24,269 కోట్లు, మార్చిలో రూ. 25,082 కోట్లు, ఫిబ్రవరిలో రూ. 29,303 కోట్లు, జనవరిలో రూ. 39,688 కోట్లు, డిసెంబర్లో రూ. 41,156 కోట్లు వచ్చాయని అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ఫండ్స్ ఇన్ఇండియా (యాంఫీ) తెలిపింది.
అనేక కారణాలు
ఐటీఐ మ్యూచువల్ ఫండ్ సీఈఓ జతీందర్ పాల్ సింగ్ మాట్లాడుతూ, "ఈసారి నికర ఈక్విటీ నిధుల తగ్గుదలకు అనేక కారణాలున్నాయి. గత నెల ఈక్విటీ మార్కెట్ పనితీరు బాగుంది. ఇన్వెస్టర్లు ప్రాఫిట్బుకింగ్కు మొగ్గుచూపారు. భారతదేశం పాకిస్తాన్పై 'ఆపరేషన్ సిందూర్' ప్రారంభించిన తర్వాత ఏర్పడ్డ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వంటివి ఇన్వెస్టర్లను పెట్టుబడులకు దూరంగా ఉంచాయి”అని పేర్కొన్నారు.
మార్నింగ్ స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్, మేనేజర్ రీసెర్చ్ హిమాన్షు శ్రీవాస్తవ మాట్లాడుతూ ఏప్రిల్తో పోలిస్తే మే నెలలో ఈక్విటీ మార్కెట్ ఉత్సాహంగా ఉండటం, ప్రపంచ ఆర్థిక సమస్యల గురించిన ఆందోళనలు పెట్టుబడిదారులను వెనక్కి లాగాయని చెప్పారు. మే నెలలో ఈక్విటీ మార్కెట్లు తమ వృద్ధిని కొనసాగించినప్పటికీ, లాభాలు సాపేక్షంగా తక్కువగా ఉన్నాయని వివరించారు.
ఈక్విటీ ఫండ్స్కేటగిరీల్లో ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ మే నెలలో అత్యధికంగా రూ. 3,841 కోట్లను ఆకర్షించాయి. ఈక్విటీ -సంబంధిత పొదుపు పథకాల నుంచి (ఈఎల్ఎస్ఎస్) రూ. 678 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. వాల్యూ ఫండ్స్లో రూ.92 కోట్లు, డివిడెండ్ యీల్డ్ ఫండ్స్ నుంచి రూ.21 కోట్ల ఔట్ఫ్లో ఉంది. లార్జ్-క్యాప్ ఫండ్స్కు మే నెలలో రూ. 1,250 కోట్లు వచ్చాయి. ఏప్రిల్లో రూ. 2,671 కోట్ల ఇన్ఫ్లో ఉంది. మిడ్-క్యాప్ ఫండ్స్ మే నెలలో రూ. 2,808 కోట్లకు తగ్గాయి. అంతకు ముందు నెలలో రూ. 3,313 కోట్లు వచ్చాయి.
స్మాల్-క్యాప్ ఫండ్స్ మే నెలలో రూ. 3,214 కోట్లను ఆకర్షించాయి. అంతకుముందు నెలలో రూ. 3,999 కోట్ల ఇన్ఫ్లో ఉంది. గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) మే నెలలో రూ. 292 కోట్ల ఇన్ఫ్లో సాధించాయి. డెట్ఫండ్స్లో రూ. 15,908 కోట్ల ఉపసంహరణ కనిపించింది. అయితే ఏప్రిల్లో రూ. 2.2 లక్షల కోట్ల ఇన్ఫ్లో ఉంది. కార్పొరేట్ బాండ్ ఫండ్స్లో మాత్రం భారీ ఇన్ఫ్లో ఉంది.