తన్మయ్ సెంచరీ.. హైదరాబాద్ విక్టరీ

తన్మయ్ సెంచరీ.. హైదరాబాద్ విక్టరీ

హైదరాబాద్‌‌, వెలుగు: సీనియర్ బ్యాటర్ తన్మయ్ అగర్వాల్ (127 బాల్స్‌‌లో 12 ఫోర్లు, 5 సిక్సర్లతో 163 ) సెంచరీతో సత్తా చాటడంతో  ఆలిండియా బుచ్చిబాబు ఇన్విటేషన్ టోర్నమెంట్‌‌లో హైదరాబాద్ అద్భుత విజయం సాధించింది. బుధవారం ముగిసిన తొలి రౌండ్ మ్యాచ్‌‌లో 4 వికెట్ల తేడాతో పంజాబ్‌‌ను ఓడించింది. ఓవర్‌‌‌‌నైట్ స్కోరు 267/6తో మూడో రోజు ఆట కొనసాగించిన హైదరాబాద్​ తొలి ఇన్నింగ్స్‌‌లో 90 ఓవర్లలో 355/7 స్కోరు చేసి ఏడు రన్స్ ఆధిక్యం సాధించింది. 

ఎ. వరుణ్ గౌడ్ (74 నాటౌట్) రాణించాడు. అనంతరం  పంజాబ్ 39.5 ఓవర్లలో 298/8 స్కోరు వద్ద రెండో ఇన్నింగ్స్‌‌ను డిక్లేర్ చేసింది. అన్మోల్‌‌ప్రీత్ సింగ్ (73), సలీల్ అరోరా (68), ప్రభ్‌‌సిమ్రన్ సింగ్ (59)  రాణించారు.  టి. రవి తేజ 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం 292 రన్స్ టార్గెట్ ఛేజింగ్‌‌లో హైదరాబాద్ దూకుడుగా ఆడింది.  తన్మయ్ భారీ షాట్లతో విజృంభించగా..  హిమ తేజ (50), కె రోహిత్ రాయుడు (25) లు కూడా విలువైన  రన్స్ అందించడంతో హైదరాబాద్ 41 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి టార్గెట్ ఛేజ్‌‌ చేసి విజయం ఖాతాలో వేసుకుంది.