ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో భారీ మోసం రూ.57 లక్షలు పోగొట్టుకున్న సీనియర్ సిటిజన్

 ఆన్లైన్  ట్రేడింగ్ పేరుతో భారీ మోసం రూ.57 లక్షలు పోగొట్టుకున్న సీనియర్ సిటిజన్

బషీర్​బాగ్, వెలుగు: ఆన్​లైన్ ట్రేడింగ్ పేరుతో ఓ సీనియర్ సిటిజన్ ను మోసం చేసిన స్కామర్స్​అతని వద్ద ఉంచి రూ.57 లక్షలు కాజేశారు. హైదరాబాద్ సైబర్ క్రైం ఏసీపీ శివమారుతి తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ కు చెందిన సీనియర్ సిటిజన్ ఇన్​స్టాగ్రామ్ లో ఓ యాడ్ చూశాడు. అందులో ఎఫ్ఎక్స్ రోడ్ అనే ఆన్​లైన్​ట్రేడింగ్ లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని ఉండడంతో  ఆ యాడ్ పై క్లిక్ చేశాడు. లైన్​లోకి వచ్చిన స్కామర్స్​అతని డిజిటల్ సిగ్నేచర్​ తీసుకొని, పెట్టుబడి ఎలా పెట్టాలో తెలిపారు. 

పెట్టుబడి డబ్బులను క్రూడ్ ఆయిల్, టెస్లా కంపెనీ, క్రిప్టో కరెన్సీలో బిజినెస్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. నమ్మకం కలిగించేందుకు నకిలీ ట్రేడింగ్ యాప్ లో లాభాలు వస్తున్నట్లు చూపెట్టారు. దీంతో సీనియర్​సిటిజన్​పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాడు. ఇందుకోసం రూ.25 లక్షల వరకు అప్పు చేశాడు. పెట్టిన డబ్బులను విత్ డ్రా చేయడానికి స్కామర్స్ అనుమతి ఇవ్వలేదు. ఇంకా పెట్టుబడి పెట్టాలని ఒత్తిడి చేయడంతో మోసపోయినట్లు గ్రహించాడు. రూ.57,43,414 కోల్పోయానంటూ మంగళవారం సైబర్​క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీపేర్కొన్నారు.

రూ.20 కాయిన్ ను  ..రూ.50 లక్షలకు కొంటామని నమ్మించి..

రూ.20 కాయిన్​ను రూ.50 లక్షలకు కొనుగోలు చేస్తామని నమ్మించిన స్కామర్స్​ ఓ సీనియర్ సిటిజన్ నుంచి రూ.1.46 లక్షలు కాజేశారు. హైదరాబాద్ సైబర్ క్రైం ఏసీపీ శివమారుతి తెలిపిన వివరాల ప్రకారం.. దారుల్ షిఫా ప్రాంతానికి చెందిన సీనియర్ సిటిజన్ స్కామర్స్​యూట్యూబ్ లో పోస్ట్ చేసిన ఓ వీడియోను చూశాడు. అందులో రూ.20 కాయిన్ ను పోస్ట్ చేసి, అరుదైనదని చెప్పారు. ఇలాంటిది ఎవరి దగ్గరైనా ఉంటే రూ.50 లక్షలకు కొనుగోలు చేస్తామన్నారు. 

అలాంటి కాయిన్ తన వద్ద ఉండడంతో సీనియర్​సిటిజన్​ఆ వీడియో ఉన్న నంబర్​కు ఫోన్​చేశాడు. లైన్ లోకి వచ్చిన స్కామర్స్ పర్చేస్ ఫైల్ క్రియేట్ చేయడానికి మొదట రూ.1,500 వసూలు చేశారు. తర్వాత వివిధ సాకులతో మొత్తం రూ.1,46,100 కాజేశారు. అనంతరం మరో రూ.లక్ష డిమాండ్ చేయడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు మంగళవారం సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ పేర్కొన్నారు.