సీనియర్ జర్నలిస్టు దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి కన్నుమూత

సీనియర్ జర్నలిస్టు దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి కన్నుమూత

సీనియర్ జర్నలిస్ట్, ఏపీ ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్‌ దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి కన్నుమూశారు. వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురం మండలం కొవరంగుట్టపల్లి గ్రామానికి చెందిన శ్రీనాథ్‌రెడ్డి.. ఇండియన్ ఎక్స్ ప్రెస్ గ్రూపు సంస్థలు, బీబీసీ, సాక్షి దినపత్రికల్లో ఉన్నత హోదాలో పని చేశారు. శ్రీనాథ్‌రెడ్డి చెన్నై ట్రిప్లికేన్ లోని హిందూ హైస్కూలులో 10వ తరగతి వరకూ చదివారు. ఆ తర్వాత తిరుపతిలోని ప్రతిష్ఠాత్మక శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలలో బీకామ్ చదివారు. అనంతరం పాత్రికేయ రంగంలో అడుగు పెట్టారు. ఆంధ్రప్రభ ద్వారా 1978లో జర్నలిజం వృత్తిలో చేరిన శ్రీనాథ్‌ రెడ్డి దాదాపు నాలుగు దశాబ్దాల పాటు పాత్రికేయ రంగంలో కొనసాగారు. మొదట్లో తెలుగు దినపత్రికల్లో జర్నలిస్ట్ గా పనిచేశారు. అనంతరం కొన్ని ఇంగ్లీషు పేపర్లలోనూ చాలాకాలం పాటు పని చేశారు. 

రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలపై 'సెవెన్ రోడ్స్ జంక్షన్' పేరుతో దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి రాసిన కాలమ్స్ విశేష ప్రాచుర్యం పొందాయి. 1990వ దశకంలో ఆయన కొన్నేళ్లపాటు బీబీసీ రేడియోకు పని చేశారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(ఏపీయూడబ్ల్యూజే) కడప జిల్లా అధ్యక్షుడిగా దాదాపు 24 సంవత్సరాలు పని చేసిన శ్రీనాథ్‌ రెడ్డి.. ఆ తర్వాత ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శిగా కూడా పని చేశారు.