వాక్ స్వాతంత్ర్యం, స్వేచ్ఛ హద్దులు దాటి.. విద్వేషంగా మారితే..

వాక్ స్వాతంత్ర్యం, స్వేచ్ఛ హద్దులు దాటి.. విద్వేషంగా మారితే..

భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో వాక్ స్వాతంత్ర్యం అనేది పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన అత్యంత విలువైన ఆయుధం. కానీ ఆ స్వేచ్ఛ హద్దులు దాటి, విద్వేషంగా మారి, సమాజంలో సోదర భావాన్ని దెబ్బతీస్తుంటే న్యాయస్థానాలు చూస్తూ ఊరుకోలేవు.  సరిగ్గా ఇదే అంశంపై ఇటీవల భారత సర్వోన్నత న్యాయస్థానంలో ఒక ఆసక్తికరమైన విచారణ జరిగింది.  

లక్నో విశ్వవిద్యాలయ మాజీ ఉప కులపతి, ప్రముఖ సామాజిక కార్యకర్త రూప్ రేఖ వర్మ,  ఇతర ప్రముఖులు దాఖలు చేసిన ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై  విచారణ జరుపుతూ..  ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయ ముఖచిత్రంపై, ముఖ్యంగా  రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారి ప్రవర్తనపై తీవ్రమైన చర్చకు దారి తీశాయి.   మాట అనేది  కేవలం  నాలుక  నుంచి రాదు,  అది ఆలోచన నుంచి పుడుతుంది.  రాజ్యాంగ విరుద్ధమైన  ఆ  ఆలోచనలను  తుడిచిపెట్టడమే అసలైన సవాలు అని ధర్మాసనం చేసిన వ్యాఖ్య రాజకీయ పార్టీల అంతరాత్మను ప్రశ్నించేలా ఉంది.

ప్రజలను  కులాలు, మతాలు, ప్రాంతాలవారీగా విడదీయడం, ఒకవర్గంపై మరొక వర్గాన్ని రెచ్చగొట్టడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలోనే రూప్ రేఖ వర్మతోపాటు మాజీ ఐఏఎస్ అధికారులు, ఇతర సామాజికవేత్తలు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.  బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు ఇలా మాట్లాడకుండా ఉండేలా తగిన మార్గ దర్శకాలు జారీ చేయాలని వారు న్యాయస్థానాన్ని కోరారు. ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టిన ధర్మాసనంలో  న్యాయమూర్తులు జస్టిస్  సూర్య కాంత్, జస్టిస్  బి.వి. నాగరత్న,  జస్టిస్ జొయ్మల్యా బాగ్చీ ఉన్నారు. ఈ ముగ్గురు న్యాయమూర్తులు చేసిన పరిశీలనలు అత్యంత లోతైనవి, తాత్వికమైనవి.  

​విచారణ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ నాగరత్న ఒక అద్భుతమైన అంశాన్ని లేవనెత్తారు. మనం ఎన్ని చట్టాలు తెచ్చినా, ఎన్ని గీతలు గీసినా మనిషి ఆలోచనను ఎలా నియంత్రించగలం అనే సందేహాన్ని ఆమె వ్యక్తం చేశారు. మాట అనేది ఆలోచన నుంచి పుడుతుంది, కాబట్టి ఆ మూలమైన ఆలోచనలోనే  మార్పు రావాలి. రాజ్యాంగ విరుద్ధమైన,  సమాజానికి హాని కలిగించే ఆ ఆలోచనలనే  మనం తుడిచిపెట్టాలి.  అప్పుడే విద్వేష ప్రసంగాలు ఆగుతాయి అని ఆమె వ్యాఖ్యానించారు.

భావజాలాన్ని సంస్కరించాలి

ఇది కేవలం న్యాయపరమైన వ్యాఖ్య  మాత్రమే కాదు, ఇది ఒక సామాజిక సంస్కరణ అవసరాన్ని గుర్తు చేసింది.  మనిషి మనసులో విషం ఉన్నంతకాలం, అది మాటల రూపంలో  బయటకు వస్తూనే ఉంటుంది.  కేవలం మాటలను నిషేధిస్తే  సరిపోదు, ఆ భావజాలాన్ని సంస్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ వ్యాఖ్య స్పష్టం చేస్తోంది. ​అలాగే, ధర్మాసనానికి నేతృత్వం వహించిన  న్యాయమూర్తి జస్టిస్  సూర్యకాంత్  స్పందిస్తూ..  ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు వేసే వారి బాధ్యతను  కూడా గుర్తు చేశారు. 

 పిటిషనర్లు కేవలం కొన్ని పార్టీల  నాయకులను,  కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను మాత్రమే లక్ష్యంగా చేసుకుని వ్యాజ్యం వేయడాన్ని ఆయన తప్పుబట్టారు. మీరు ప్రముఖ వ్యక్తులు, విద్యావేత్తలు,  మీ వ్యాజ్యం నిష్పక్షపాతంగా ఉండాలి.  కేవలం కొందరిని లక్ష్యంగా చేసుకుంటూ  మిగతావారిని  వదిలేయడం  సరికాదు.  న్యాయస్థానాన్ని రాజకీయ వేదికగా మార్చవద్దు అని ఆయన హితవు పలికారు. 

పార్టీలకు రాజ్యాంగ నైతికత ఉండాలి

​రాజ్యాంగ పీఠికలో  పేర్కొన్న సోదరభావం అనే పదాన్ని ధర్మాసనం ఈ సందర్భంగా గుర్తు చేసింది.  దేశంలో ప్రజల మధ్య ఐకమత్యాన్ని, సోదరభావాన్ని పెంపొందించాల్సిన బాధ్యత రాజకీయ నాయకులదే.  వారు ప్రజల మధ్య చిచ్చుపెట్టేలా కాకుండా,  కలిపి ఉంచేలా వ్యవహరించాలి అని న్యాయస్థానం స్పష్టం చేసింది. న్యాయమూర్తి జస్టిస్ జొయ్మల్యా బాగ్చీ స్పందిస్తూ.. ఈ బాధ్యత రాజకీయ పార్టీలమీద కూడా ఉంద న్నారు. విద్వేషంగా మాట్లాడే వ్యక్తి ఆ పార్టీ సభ్యుడు లేదా నాయకుడు అయి ఉంటాడు,  కాబట్టి ఆ పార్టీనే  వారిని  నియంత్రించాలి.  

ప్రతిదానికి న్యాయస్థానం గీతలు గీయలేదు, పార్టీలకు రాజ్యాంగ నైతికత ఉండాలి అని వ్యాఖ్యానించారు.​ పిటిషనర్లు లేవనెత్తిన అంశం వాస్తవమే అయినప్పటికీ, వారు సమర్పించిన ఆధారాలు పక్షపాతంతో ఉన్నాయని న్యాయస్థానం అభిప్రాయపడటంతో పిటిషనర్లు తమ వ్యాజ్యాన్ని వెనక్కి తీసుకుని, మరింత సమగ్రంగా, అందరినీ కలుపుకుని కొత్త వ్యాజ్యం వేస్తామని తెలిపారు. దీనికి న్యాయస్థానం అనుమతినిచ్చింది. 

సర్వోన్నత న్యాయస్థానం సందేశాలు

ఈ పరిణామం ద్వారా  సర్వోన్నత న్యాయస్థానం మూడు  బలమైన  సందేశాలను  పంపింది.  మొదటిది..  కేవలం  బయటకువచ్చే  మాటలను  నియంత్రిస్తే సరిపోదు,  నాయకుల  మెదళ్ళలో ఉన్న  విషపూరిత ఆలోచనలను తొలగించాలి.  ఇది జరగాలంటే  రాజకీయ  పార్టీలు  తమ  సిద్ధాంతాలను  రాజ్యాంగ బద్ధంగా మార్చుకోవాలి.  రెండోది.. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారికి హుందాతనం ఉండాలి.  మూడోది.. ప్రజాస్వామ్యంలో  న్యాయం కోరేవారు కూడా  నిష్ప క్షపాతంగా ఉండాలి.   

దేశంలో  పెరుగుతున్న అసహనం,  రాజకీయ  విద్వేషాల మధ్య,  రాజ్యాంగ  నైతికత  అనే  దీపాన్ని  వెలిగించాల్సిన బాధ్యత ఇప్పుడు రాజకీయ పక్షాలదే.  ఎన్నికల్లో  గెలవడం కోసం ప్రజల మధ్య అగాధాలు  సృష్టించడం  తాత్కాలికంగా  అధికారాన్ని  ఇవ్వవచ్చు.  కానీ,  అది దేశ సమగ్రతకు తీరని నష్టం కలిగిస్తుంది. న్యాయస్థానాలు కేవలం హెచ్చరించగలవు. కానీ, మార్పు రావాల్సింది రాజకీయ వ్యవస్థలోనే. రాజకీయం అనేది ప్రజలకు సేవ చేయడానికి ఒక మార్గమే తప్ప, వారిని విడదీసి పాలించడానికి ఒక ఆయుధం కాకూడదు అనే సత్యాన్ని మన నాయకులు ఎంత త్వరగా గ్రహిస్తే దేశానికి అంత మంచిది.

-పురుషోత్తం నారగౌని
సీనియర్ జర్నలిస్ట్

NOTE : ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ: openpage@v6velugu.com
 రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.  రచన 700 పదాలకు మించరాదు