ఎంపీ టికెట్ ఇవ్వకుంటే.. నా దారి నాదే.. హైకమాండ్​కు అల్టిమేటమ్

ఎంపీ టికెట్ ఇవ్వకుంటే.. నా దారి నాదే.. హైకమాండ్​కు అల్టిమేటమ్
  • బీజేపీ హైకమాండ్​కు సీనియర్ నేతల అల్టిమేటమ్
  • మల్కాజిగిరి, మహబూబ్ నగర్, జహీరాబాద్, మెదక్, వరంగల్ స్థానాల్లో సవాల్​గా మారిన అభ్యర్థుల ఎంపిక
  • ఇతర పార్టీల నుంచి వచ్చే వారికి కొన్ని సీట్లు ఇచ్చే ఆలోచనలో కమలం పార్టీ 
  • ఉండాల్నా.. పోవాల్నా అంటున్న బరిలో ఉన్న సీనియర్లు

ఇతర పార్టీల్లోంచి వచ్చి గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన 119 మందిలో ఓడిన మెజార్టీ అభ్యర్థులు పార్టీకి టచ్​లో లేరని, ఇప్పుడు కూడా అలాంటి వారికి టికెట్ ఇస్తే ఏమవుతుందో ఆలోచించాలని పలువురు సీనియర్లు బీజేపీ జాతీయ, రాష్ట్ర నేతలను కోరుతున్నారు. మల్కాజిగిరి టికెట్ విషయంలో మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, బీజేపీ మధ్య ప్రదేశ్  రాష్ట్ర ఇన్​చార్జి మురళీధర్ రావు, మాజీ ఎంపీ చాడా సురేశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు, మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ కొడుకు వీరేందర్ గౌడ్ పోటీ పడుతున్నారు. ఇందులో ఇద్దరు నేతలు మాత్రమే బీజేపీలో మొదటి నుంచి ఉన్నారు. మిగితా వారు ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన వారే. మల్కాజిగిరి టికెట్​ను బీజేపీ హైకమాండ్ ఎవరికి ఖరారు చేసినా, ఆ వెంటనే ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతల్లో ఏ ఒక్కరు కూడా బీజేపీలో ఉండరని పార్టీలో చర్చ నడుస్తున్నది. ఇందులో తమకు టికెట్ ఇవ్వకుంటే పార్టీలో ఉండేది లేదని ఓ ముగ్గురు కీలక నేతలు ఇప్పటికే ఢిల్లీ పెద్దలకు తెగేసి చెప్పినట్లు తెలుస్తున్నది. టికెట్ రాకుంటే కాంగ్రెస్ లో చేరుతానని ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన ఓ మాజీ ప్రజా ప్రతినిధి బాహాటంగానే చెబుతున్నట్లు ప్రచారం సాగుతోంది. సదరు నేత ఇప్పటికే సీఎం రేవంత్ తో టచ్ లో ఉన్నారని, బీజేపీ టికెట్ ఇవ్వకుంటే ఆ వంకతో పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిపోయేందుకు ఇప్పటికే అక్కడ ఖర్చీఫ్ వేసుకున్నారనే చర్చ నడుస్తున్నది. 

మహబూబ్​నగర్​లో ఇద్దరి మధ్య..

మహబూబ్ నగర్ ఎంపీ సీటు కోసం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నారు. రాష్ట్ర పార్టీలో ఈ ఇద్దరూ కీలక నేతలే. వీరితో పాటు అక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్న వారిలో జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి, బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతి కుమార్ ఉన్నారు. డీకే అరుణ, జితేందర్ రెడ్డి.. ఇద్దరూ మోదీ, అమిత్ షా, నడ్డాతో నేరుగా సంబంధాలు ఉన్న నేతలే. పైగా వీరు రాష్ట్ర బీజేపీలో బలమైన నేతలుగా ముద్రపడిన వారే. ఈ పరిస్థితుల్లో పార్టీ హైకమాండ్ టికెట్ ఎవరికి ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది. 

జహీరాబాద్​లో బయటి వ్యక్తికి చాన్స్​?

జహీరాబాద్ టికెట్​ను బయటి నుంచి వచ్చే ఓ నేతకు ఇవ్వాలనే ఆలోచనలో బీజేపీ హైకమాండ్ ఉన్నట్లు ప్రచారం సాగుతున్నది. అదే నిజమైతే పార్టీలో ఉండి టికెట్ ఆశిస్తున్న నేతలు బీజేపీలో కంటిన్యూ అవడం అనుమానమేననే అభిప్రాయం రాష్ట్ర పార్టీ నేత ఒకరు వ్యక్తం చేశారు. ఇక్కడి నుంచి పోటీ కోసం పార్టీ నేతలు మాజీ ఎంపీ బాగారెడ్డి కొడుకు జైపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్ రెడ్డి కొడుకు మహిపాల్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి ఆలె నరేంద్ర కొడుకు ఆలె భాస్కర్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ప్రముఖ న్యాయవాది రచనా రెడ్డి ఇక్కడి నుంచి పోటీకి ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ జాతీయ నాయకత్వం ఇప్పటికే బయటి నుంచి పార్టీలో చేరాలనే ఓ ముఖ్య నేతకు టికెట్ హామీ ఇచ్చినట్లు  ప్రచారం సాగుతున్నది. ఇది నిజమైతే పార్టీలో ఇంతకాలం ఉన్నవారి రియాక్షన్ తీవ్రంగానే ఉండనుందనేది పార్టీ నేతల మాట. 

వరంగల్​లో సీనియర్​ నేత..

వరంగల్ సీటును ఇతర పార్టీ నుంచి వచ్చే ఓ సీనియర్ నేతకు ఇవ్వాలని బీజేపీ నాయకత్వం సూచనప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం. అయితే ఇక్కడి నుంచి పోటీ కోసం మాజీ ఐపీఎస్ అధికారి కృష్ణ ప్రసాద్, బీజేపీలో సీనియర్ నేత చింతా సాంబమూర్తి, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ పోటీ పడుతున్నారు. బయటి నేతకు టికెటిస్తే.. వీరి పరిస్థితి ఏమిటనే చర్చ సాగుతున్నది. మెదక్ నుంచి టికెట్ ఆశిస్తున్న వారిలో మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావుది నాలుగో పేరు అని కొందరు పార్టీ నేతలు అంటున్నారు. ఆయనకు ముందు ముగ్గురు నేతల పేర్లు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అక్కడి నుంచి పోటీకి ప్రముఖ పారిశ్రామిక వేత్త ఒకరు ఇప్పటికే ఢిల్లీ నేతలతో టచ్​లో ఉన్నట్లు తెలుస్తున్నది. పార్టీ మరో సీనియర్ నేత గోదావరి అంజిరెడ్డి కూడా సీరియస్ గానే టికెట్ రేసులో ఉన్నారు. మరో నేత కూడా తన పేరును ఈసారైనా పరిశీలించాలని గట్టిగా పట్టుబడుతున్నట్లు సమాచారం.

నాగర్​కర్నూల్​లో..

నాగర్ కర్నూల్ నుంచి బీజేపీ మాజీ జాతీయ​అధ్యక్షుడు, మాజీ కేంద్ర మంత్రి బంగారు లక్ష్మణ్ కూతురు బంగారు శృతి టికెట్ పై ఆశలు పెట్టుకున్నారు. ఆమె పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కీలక బాధ్యతల్లో ఉన్నారు. అక్కడి నుంచి బీఆర్ఎస్​లో ఉన్న ఓ ముఖ్యనేతకు టికెట్ ఇవ్వనున్నారనే ప్రచారం సాగుతోంది. ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకొని ఉన్న తమ లాంటి వారి పరిస్థితి ఏమిటనే ఆందోళన శృతి వంటి నేతల్లో  కనిపిస్తున్నది. చాలా నియోజకవర్గాల్లో ఇదే రకమైన పరిస్థితి కనిపిస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ సీనియర్ నేతల్లో ఉన్న అసంతృప్తిని చల్లార్చి, వారిలో సమన్వయం సాధించడం బీజేపీ హైకమాండ్​కు పెద్ద సమస్యే.