జోకుడుగాళ్లతోనే బీఆర్ఎస్ ​ఓటమి : ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి

జోకుడుగాళ్లతోనే బీఆర్ఎస్ ​ఓటమి : ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి
  • జోకుడుగాళ్లతోనే బీఆర్ఎస్ ​ఓటమి 
  • నిజాలు చెప్పేవారిని దగ్గరకు రానియ్యలేదు
  • ఎర్రబెల్లి, సత్యవతి లాంటి వారికి మంత్రి పదవులిస్తే ఉద్యమకారులు బాధపడ్డరు
  • కొన్ని జిల్లాల్లో ఎమ్మెల్యేలు ప్రజలకు ఇరిటేషన్​ పెంచారు
  • మాజీ ఎమ్మెల్యేలకు సెక్యూరిటీ అక్కర్లేదు..
  • వారివెంట కుక్కలు కూడా పడవు
  • బీఆర్ఎస్​ ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్​రావు సంచలన వ్యాఖ్యలు
  • కామెంట్స్​ కలకలం రేపడంతో.. తాను అలా అనలేదని ప్రకటన

హైదరాబాద్, వెలుగు :  జోకుడుగాళ్లతోనే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్​ఓడిపోయిందని ఆ పార్టీ ​ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్​రావు అన్నారు. పార్టీ అధినేత నిజాలు చెప్పే అవకాశమిస్తే ఎవరైనా ధైర్యం చేసి చెప్తారని, నిజాలు చెప్పేవాళ్లు బయట, జోకుడుగాళ్లు లోపల ఉంటే ఇక ఆయనకు వాస్తవాలు ఎలా తెలుస్తాయని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయామనే విషయం అందరికీ తెలిసినా, ఎవరూ ఓపెన్​గా మాట్లాడటం లేదని, తాను మాత్రం బాహాటంగానే నిజాలు చెప్తున్నానని పేర్కొన్నారు. 

వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో పార్టీ పరిస్థితి దారుణంగా దెబ్బతినడానికి ఆయన కారణాలు చెప్పారు. శుక్రవారం అసెంబ్లీ లాబీల్లో ఆయన మీడియాతో చిట్​చాట్​చేస్తూ పార్టీ ఓటమిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వరంగల్​ఆత్మగౌరవం ఉన్న తెలంగాణ ఉద్యమకారుల ఖిల్లా అని.. తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని ఎర్రబెల్లి దయాకర్​రావు, సత్యవతి రాథోడ్​లాంటి వారికి మంత్రి పదవులు ఇస్తే ఉద్యమకారులు చాలా బాధపడ్డారని గుర్తు చేశారు. తెలంగాణవాదం, ఉద్యమం తెలియని వారికి మంత్రి పదవులు ఇస్తే ఫలితాలు ఇట్లానే ఉంటాయని చెప్పారు. 

ఖమ్మం జిల్లాలో మొదటి నుంచి పార్టీ బలహీనంగా ఉందని, 2014, 2018 ఎన్నికల్లో ఒక్కో సీటే గెలిచినా ఇతర పార్టీల్లో గెలిచిన వాళ్లను పార్టీలో చేర్చుకుంటే ఉద్యమకాలం నుంచి బీఆర్ఎస్ లో​ఉన్నవాళ్లను కొత్తగా వచ్చిన వాళ్లు తొక్కేశారని చెప్పారు. రెండు ఎన్నికల్లో గెలిచిన వాళ్లను పార్టీలో చేర్చుకోవడంతో ఖమ్మంలో గ్రూపు రాజకీయాలు ఎక్కువై ఒకరికి వ్యతిరేకంగా ఇంకొకరు పని చేశారని తెలిపారు. ఎర్రబెల్లి దయాకర్​రావు ఎలాంటి మనిషో నియోజకవర్గ ప్రజలకు మాత్రమే తెలుసని, ఆయన చెక్కిలిగింతలు పెట్టడం తప్ప ఒక్కరికీ రూపాయి సాయం చేయడని విమర్శించారు. ఆయనను మంచి లీడర్​అని ఎవరైనా అంటే నియోజకవర్గంలో ఉరికిచ్చి కొడుతారని కామెంట్​ చేశారు. 

నల్గొండ జిల్లాలో ఎమ్మెల్యేల వ్యవహార శైలి పార్టీని దెబ్బతీసిందన్నారు. కొన్ని జిల్లాల్లో బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు ప్రజలకు ఇరిటేషన్​ పెంచారని, దాన్ని ఎలా మెనేజ్​చేయాలనే ప్లాన్​ పార్టీకి లేకుండా పోయిందని, అలాంటి పరిస్థితులు గ్రౌండ్​లో ఉంటే ఇక ఎన్నికల్లో ఎలా గెలుస్తామని చెప్పుకొచ్చారు. ఉమ్మడి వరంగల్​జిల్లా పరిధిలోని మాజీ ఎమ్మెల్యేలకు సెక్యూరిటీ తగ్గించడం కాదు, అసలు సెక్యూరిటీనే అవసరం లేదన్నారు. వాళ్ల వెంట కుక్కలు కూడా పడవని సంచలన కామెంట్స్​ చేశారు.

ఆ మాటలు అనలే: తక్కళ్లపల్లి

చిట్​చాట్​పేరుతో తాను అనని మాటలను అన్నట్టు మీడియాలో ప్రసారం చేస్తున్నారని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్​రావు తెలిపారు. అసెంబ్లీ లాబీలో ఆయన చేసిన కామెంట్స్​సంచలనం సృష్టించడంతో శుక్రవారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేశారు. తాను ఏదైనా మాట్లాడాలని అనుకుంటే ప్రెస్​మీట్ పెడుతాను కానీ.. చిట్​చాట్​లో మాట్లాడబోనన్నారు. కేసీఆర్ పై తనకు విశ్వాసం ఉందని, ఆయన అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నెరవేర్చానన్నారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమన్నారు. ఓటమికి కారణాలను పార్టీ వేదికల్లోనే చెప్తాను తప్పా చిట్​చాట్​లో చెప్పబోనన్నారు.