
- ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి
- దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో బీజేపీ నేతలు టార్గెట్
- ఈ రిపోర్ట్ ఆధారంగా ప్రణీత్రావును ప్రశ్నించిన సిట్
- అర్వింద్, జితేందర్ రెడ్డి ఫోన్ల ట్యాపింగ్పై కొనసాగిన ఎంక్వైరీ
హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గత బీఆర్ఎస్ సర్కారు టార్గెట్ లిస్ట్లో బీజేపీ సీనియర్ నేత ఏపీ జితేందర్రెడ్డి, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కుమార్ ఫోన్ నంబర్లు కూడా ఉన్నట్లు ఫోరెన్సిక్ సైన్స్ల్యాబోరేటరీ (ఎఫ్ఎస్ఎల్) రిపోర్ట్ బయటపెట్టింది. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో వీరిద్దరితోపాటు వాళ్ల అనుచరులు మొత్తంగా మరో 200 మందికి పైగా ఫోన్లను ట్యాప్ చేసినట్టు సిట్ దర్యాప్తులో వెల్లడైంది.
ఈ క్రమంలోనే స్పెషల్ ఆపరేషన్ టార్గెట్స్ (ఎస్ఓటీ) కేంద్రంగా జరిగిన ఫోన్ ట్యాపింగ్ గుట్టును సిట్ రట్టు చేస్తున్నది. కేసులో రెండో నిందితుడైన ప్రణీత్రావు సెల్ఫోన్ డేటాకు సంబంధించి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నది. ఇందులో భాగంగా ప్రణీత్రావు శుక్రవారం సిట్ ముందు హాజరయ్యాడు. ప్రస్తుతం బెయిల్పై ఉన్న ప్రణీత్రావును వారం రోజుల వ్యవధిలో మూడు సార్లు విచారించారు. ఫోన్ నంబర్లు, వాట్సాప్ చాటింగ్స్ను ముందుంచి ప్రశ్నిస్తున్నారు.
పక్కా ఆధారాలు సేకరించిన సిట్
దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో బీజేపీలో ఎంపీ ధర్మపురి అర్వింద్, జితేందర్రెడ్డి కీలకంగా వ్యవహరించారు. జితేందర్ రెడ్డి దుబ్బాక ఇన్చార్జిగా పనిచేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు వీరిద్దరి కదలికలపై గత బీఆర్ఎస్ సర్కారు నిఘా పెట్టింది. ఈ క్రమంలోనే ప్రణీత్రావు టీమ్ ద్వారా ఫోన్ ట్యాపింగ్కు పాల్పడింది.
వీరిద్దరి అనుచరులపై నిఘా పెట్టి ఎప్పటికప్పుడు స్థానిక పోలీసులకు సమాచారం అందించేవారని సిట్ దర్యాప్తులో తేలింది. బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా వీళ్లు చేసే క్యాంపెయిన్, డబ్బు రవాణా సహా ఇతర వ్యక్తిగత వివరాలను తెలుసుకునే వారని సిట్ గుర్తించింది. ఇలా ఉప ఎన్నికల సమయంలో 3 నెలల పాటు వీరిద్దరిపై నిరంతరం నిఘా పెట్టినట్లు సిట్ అధికారులు ఆధారాలు సేకరించారు.
విడివిడిగా ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు ఎంక్వైరీ
ఈ కేసులో ప్రధాన నిందితుడైన ప్రభాకర్ రావును విచారిస్తూనే ప్రణీత్రావును సిట్ ప్రశ్నిస్తున్నది. ఎస్ఐబీ కేంద్రంగా స్పెషల్ ఆపరేషన్ టార్గెట్స్కు సంబంధించిన వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. బుధవారం ప్రభాకర్ రావు విచారణకు వచ్చిన సమయంలోనే ప్రణీత్రావు కూడా సిట్ ముందు హాజరయ్యాడు. దీంతో సిట్ అధికారులు వీరిద్దరిని విడివిడిగా విచారించింది.
ఈ క్రమంలోనే శుక్రవారం కూడా ప్రణీత్రావు సిట్ విచారణకు వచ్చాడు. దాదాపు ఆరు గంటల పాటు ఆయనను సిట్ విచారించింది. ప్రణీత్రావు టీమ్ ట్యాపింగ్ చేసిన ఫోన్ నంబర్లు.. ఆ తర్వాత తమ టార్గెట్స్ రహస్యాలను మాజీ అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, సిటీ టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు అందించాడనికి సంబంధించిన వివరాలతో స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు.
ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆధారంగా..
ఎఫ్ఎస్ఎల్ నుంచి అందిన రిపోర్ట్స్ఆధారంగా ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు నుంచి కీలక సమాచారం రాబట్టే అవకాశం ఉంది. రెండు రోజుల విచారణలో ప్రభాకర్ రావు తెలిపిన వివరాలతో పాటు ప్రణీత్ రావును కలిపి విచారించేందుకు సిట్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం విచారణకు హాజరయ్యే ప్రభాక్ రావు నుంచి మరింత కీలక సమాచారం సేకరించనున్నారు.
ఆ తర్వాత వీరిద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి కౌంటర్ ప్రశ్నలు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రధానంగా ప్రభాకర్ రావు వెల్లడించే సమాచారం ఆధారంగా ఆయన వాంగ్మూలం రికార్డ్ చేసి తదుపరి చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్రావు నోరు విప్పితే బీఆర్ఎస్కు చెందిన ఇద్దరు కీలక నేతల చుట్టూ ఉచ్చు బిగుసుకునే అవకాశాలు ఉన్నాయని పోలీస్వర్గాల్లో చర్చ జరుగుతున్నది.