- 166 పాయింట్లు తగ్గిన నిఫ్టీ
ముంబై : ప్రపంచ మార్కెట్లలో మిశ్రమ ధోరణుల మధ్య మెటల్ బ్యాంకింగ్ షేర్లలో ప్రాఫిట్ బుకింగ్ కారణంగా బెంచ్మార్క్ సెన్సెక్స్ సోమవారం భారీగా నష్టపోయింది. 30 షేర్ల బీఎస్ఈ సెన్సెక్స్ 523 పాయింట్లు తగ్గి 71,072.49 వద్ద స్థిరపడింది. ఇందులోని 22 స్టాక్స్నష్టపోగా, మిగతా ఎనిమిది లాభపడ్డాయి. ప్రారంభ ట్రేడ్లో ఈ బేరోమీటర్ 71,756.58 గరిష్ట స్థాయిని తాకింది. అయితే, రిలయన్స్ ఇండస్ట్రీస్, మెటల్ కంపెనీలు, బ్యాంకింగ్ షేర్లలో లాభాల స్వీకరణ వల్ల ఇంట్రా-డే ట్రేడ్లో ఇండెక్స్ 70,922.57 కనిష్ట స్థాయికి పడిపోయింది.
ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 166.45 పాయింట్లు తగ్గి 21,616.05 వద్ద ముగిసింది. ఇందులోని 34 స్టాక్స్నష్టపోయాయి. మెటల్, బ్యాంకింగ్, కొన్ని చమురు షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురికాగా, ఫార్మా, ఐటీ షేర్లు లాభాలను ఇచ్చాయి. సెన్సెక్స్ ప్యాక్లో టాటా స్టీల్ అత్యధికంగా 2.76 శాతం క్షీణించగా, ఆ తర్వాతి స్థానాల్లో ఎన్టీపీసీ 2.72 శాతం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2.26 శాతం ఉన్నాయి. ప్రైవేట్ బ్యాంకులు ఇండస్ఇండ్, కోటక్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ కూడా నష్టాలపాలయ్యాయి.
అయితే విప్రో, హెచ్సీఎల్ టెక్, మహీంద్రా అండ్ మహీంద్రా, నెస్లే లాభపడ్డాయి. బీఎస్ఈ స్మాల్క్యాప్ ఇండెక్స్ 3.16 శాతం క్షీణించగా, మిడ్క్యాప్ 2.62 శాతం నష్టపోయింది. లార్జ్క్యాప్ 0.90 శాతం పడింది. సెక్టోరల్ ఇండెక్స్లలో యుటిలిటీస్ 3.60 శాతం, రియాల్టీ 3.01 శాతం, పవర్ 2.90 శాతం, పరిశ్రమలు 2.92 శాతం, ఇంధనం 2.80 శాతం, మెటల్ 2.73 శాతం, చమురు, గ్యాస్ 2.56 శాతం క్షీణించాయి. మూలధన వస్తువులు, బ్యాంకెక్స్, ఆర్థిక సేవలు కూడా వెనకబడి ఉన్నాయి.