ముంబై: సెన్సెక్స్, నిఫ్టీ వరుసగా మూడో సెషన్లోనూ లాభాల్లో ముగిశాయి.గ్లోబల్ మార్కెట్లలో పాజిటివ్ సంకేతాలు, అమెరికాతో ట్రేడ్ ఒప్పందం కుదరడంతో సూచీలు మంగళవారం పెరిగాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 208 పాయింట్లు (0.25శాతం) పెరిగి 84,273 వద్ద ముగియగా, ఇంట్రాడేలో 417 పాయింట్లు ఎగిసి 84,482ని తాకింది.
ఎన్ఎస్ఈ నిఫ్టీ 67.85 పాయింట్లు (0.26శాతం) లాభపడి 25,935 వద్ద సెటిలయ్యింది. సెన్సెక్స్లో ఎటర్నల్, టాటా స్టీల్, ఎం అండ్ ఎం, పవర్గ్రిడ్, టీసీఎస్ లాభాల్లో కదలగా, హెచ్సీఎల్ టెక్నాలజీస్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) మంగళవారం నెట్గా రూ.69 కోట్ల విలువైన షేర్లు కొన్నారు.
డాలర్తో రూపాయి విలువ 9 పైసలు బలపడి 90.57 దగ్గర సెటిలయ్యింది. జపాన్ నికాయ్ 225 ఇండెక్స్, హాంకాంగ్ హంగ్ సెంగ్, సౌత్ కొరియా కోస్పీ, షాంఘై ఎస్ఎస్ఈ కాంపోజిట్ ఇండెక్స్లు మంగళవారం లాభాల్లో కదిలాయి. యూరోపియన్, యూఎస్ మార్కెట్లు పాజిటివ్గా ట్రేడయ్యాయి. బెంచ్మార్క్ బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్కు 68.89 డాలర్ల వద్ద ఉంది.
