కుప్పంలో ఏం జరుగుతోంది... వరుస చోరీలు.. బెంబేలెత్తుతున్న జనం ..

కుప్పంలో ఏం జరుగుతోంది... వరుస చోరీలు.. బెంబేలెత్తుతున్న జనం ..

కుప్పం నియోజికవర్గం.. ఏపీ సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కాబట్టి.. ఈ నియోజకవర్గానికంటూ ఓ ప్రత్యేకత ఉంది.అంతటి ప్రత్యేకత ఉన్న కుప్పం నియోజకవర్గంలో గత వారం రోజులుగా వరుస చోరీలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఏ రాత్రి ఎవరి ఇంట్లో దొంగలు చొరబడతారోనన్న టెన్షన్ తో జనం కంటి మీద నిద్ర లేకుండా గడుపుతున్నారు. గత కొద్దిరోజులుగా కుప్పం నియోజకవర్గంలో వరుస చోరీలు జరుగుతున్నట్లు సమాచారం. గత వారం రోజుల వ్యవధిలోనే 7 ఇళ్లలో చోరీ హరిగినట్లు తెలుస్తోంది.

గుడిపల్లి మండలంలో నివాసం ఉంటున్న ద్రవిడ వర్సిటీ వీసీ డా.కిరణ్ కుమార్, పి. ఆర్. ఓ నరేష్ ఇండ్లలో కూడా పట్టపగలే చోరీ జరిగినట్లు తెలుస్తోంది.గుడిపల్లి మండలం గుండ్ల సాగరంలో ఉన్న వీరి ఇళ్లలో ఒకేసారి దొంగతనాలు జరిగినట్లు తెలుస్తోంది. ఇదే మండలంలోని మరో గవర్నమెంట్ టీచర్ ఇంట్లో కూడా చోరీ జరిగినట్లు సమాచారం. భార్యాభర్తలు ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో.. స్కూలుకు వెళ్లి తిరిగి వచ్చేలోపు దొంగతనం జరిగినట్లు తెలుస్తోంది.

ఒకే మండలంలో ఒకేరోజు వరుసగా మూడు ఇండ్లలో చోరీ జరగటంతో జనం భయబ్రాంతులకు గురవుతున్నారు. ఈ ఘటనల్లో సుమారు రూ. 50 లక్షల విలువజేసే బంగారు, వెండి ఆభరణాలు, నగదు చోరీకి గురైనట్లు సమాచారం. అంతే కాకుండా.. కుప్పం పట్టణంలోనూ వారం రోజుల్లో నాలుగు ఇళ్లలో చోరీ జరిగినట్లు తెలుస్తోంది.ఇలా కుప్పం నియోజకవర్గ వ్యాప్తంగా వరుసగా చోరీలు జరుగుతుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జనం. వరుస ఘటనలపై ప్రత్యేక దృష్టి పెట్టి చోరీలను అరికట్టాలని పోలీసులను కోరుతున్నారు జనం.