భారత్ లో కరోనావ్యాక్సిన్ ను విక్రయించేందుకు ఆయా ఫార్మాకంపెనీలు పోటీపడుతున్నాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ, ఆస్ట్రాజెనెకా సంస్ధలతో కలిసి పనిచేస్తున్న సీరం ఇన్స్టిట్యూట్ తో పాటు అమెరికాకు చెందిన ఫైజర్, హైదరాబాద్ కు చెందిన బయోటెక్ లు కరోనా వ్యాక్సిన్ ను విడుదల చేయనున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ లో తమ వ్యాక్సిన్ ను విక్రయించేందుకు అనుమతులు కావాలంటూ ఈ మూడు సంస్ధలు కేంద్రానికి దరఖాస్తు చేసుకున్నాయి. వీటిలో సీరం ఇన్స్టిట్యూట్ భారత్లో సీరం వ్యాక్సిన్ ధర రూ.250కే అమ్ముతామని ప్రకటించింది.
సీరం వైపే కేంద్రం చూపు…
భారత్ లో ఫార్మా దిగ్గజాలు తమ కరోనా వ్యాక్సిన్ ను విక్రయించేందుకు ఉవ్విళ్లూరుతున్నా.. కేంద్రం మాత్రం సీరం ఇన్స్టిట్యూట్ ఆక్స్ఫర్డ్ వర్శిటీ, ఆస్ట్రాజెనెకా సాయంతో తయారు చేస్తున్న వ్యాక్సిన్ వైపు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. వీటిలో సీరం ఇన్స్టిట్యూట్కు ప్రపంచంలోనే అత్యధిక వ్యాక్సిన్ డోసులు తయారుచేస్తున్న సంస్ధగా గుర్తింపు ఉంది. అందుకే ఇతర ఫార్మా సంస్థల కంటే తమకే ఈ కాంట్రాక్టు దక్కుతుందని సీరం భావిస్తోంది. అయితే భారత్లో ముందుగా వ్యాక్సిన్ సరఫరా ప్రారంభించాలని, ఆ తర్వాతే ఇతర దేశాలకు విక్రయిస్తామని సీరం ఇన్స్టిట్యూట్ సీఈవో ఆధర్ పూనావాలా తాజాగా ప్రకటించారు.