RTO ఆఫీస్ లో మరో‘సారీ’ సర్వర్​ డౌన్

RTO ఆఫీస్ లో మరో‘సారీ’ సర్వర్​ డౌన్
  • వారంలో రెండోసారి సర్వర్‌ సమస్య

  • సోమవారం నాటి స్లాట్స్‌ మంగళవారానికి బదిలీ

  • తీవ్రంగా ఇబ్బంది పడిన వాహనదారులు

  • హార్డ్ వేర్ సమస్యలే కారణమంటున్న అధికారులు

హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర రవాణా శాఖలో సోమవారం ఆన్​లైన్​ సేవలు నిలిచిపోయాయి. సాఫ్ట్​వేర్​ సమస్య కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఏ సేవలు పనిచేయలేదు.   వారం వ్యవధిలోనే రెండోసారి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో ఆన్ లైన్ సేవలు స్తంభించి పోయాయి. సోమవారం కోసం ముందుగా స్లాట్ బుక్ చేసుకున్న వాహనాదారులు  ఆర్టీఏ ఆఫీసుల వద్దకు వచ్చి తీవ్ర నిరాశ, నిస్పృహలకు లోనయ్యారు. మంగళవారం మళ్లీ రావడం తమకు సాధ్యం అవుతుందో లేదోనని కొందరు వాహనదారులు విచారం వ్యక్తం చేశారు. సర్వర్ లో హార్డ్ వేర్ సమస్య కారణంగా ఆర్టీఏ సేవలు అందుబాటులో తీసుకురాలేకపోతున్నామని, దాంతో   సోమవారం అన్ని  ట్రాన్స్ జక్షన్స్ ను రద్దు చేయాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు.

సర్వర్​ సమస్యతో  లెర్నింగ్ లైసెన్స్ లు, డ్రైవింగ్ లైసెన్స్ లు, కొత్త వాహనాల రిజిస్ట్రేషన్, రెన్యూవల్, ఫిట్ నెస్ టెస్టులు ఇలా మొత్తం 59 సేవలకు బ్రేక్ పడింది.  సోమవారం సేవల కోసం స్లాట్ బుక్ చేసుకున్న వారంతా గంటల తరబడి ఆర్టీఏ కార్యాలయాల ముందు వేచి ఉండాల్సి వచ్చింది. సర్వర్​ సమస్యపై ముందస్తు సమాచారం లేకపోవటంతో తాము స్లాట్ బుక్ చేసుకున్న సమయానికి వాహనదారులంతా ఆర్టీఏ కార్యాలయాలకు వచ్చారు. ఉదయం పదకొండు గంటలకు సర్వర్ పనిచేయడం లేదనే  విషయాన్ని చల్లగా ఆర్టీఏ అధికారులు చెప్పడంతో వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రవాణా శాఖ అధికారుల నిర్లక్ష్యానికి తాము ఇబ్బంది పడాలా అని వారు నిలదీశారు. సోమవారం స్లాట్ బుక్ చేసుకున్న వారికి మంగళవారం అవకాశం కల్పిస్తామని అధికారులు  తెలిపారు.

వెంటాడుతున్న సర్వర్ సమస్యలు

రవాణా శాఖ ఆన్ లైన్ సేవల కోసం ఉపయోగించే సర్వర్ లో ఇటీవల తరచుగా సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నెల 6 వ తేదీన కూడా సర్వర్ లో సమస్య కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం సేవలను నిలిపివేశారు. సర్వర్ కు విద్యుత్ అందించేందుకు ఏర్పాటు చేసిన జనరేటర్ లో మంటలు తలెత్తటంతో సేవలను నిలిపివేశారు.  ఆ రోజు సర్వీసులు పొందని వారికి మరుసటి రోజు అవకాశం కల్పించారు. ఈ ఘటన జరిగి సరిగ్గా వారం రోజులు గడిచిందో లేదా మళ్లీ సర్వర్ లో సాంకేతిక సమస్య తలెత్తింది. హార్డ్ వేర్ ప్రాబ్లం కారణంగా సర్వర్ లో ఇబ్బందులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.   సర్వర్ సామర్థ్యానికి మించి భారం మోపుతున్నందునే ఇలాంటి  పరిస్థితికి కారణమనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది.

ఆన్ లైన్ సేవలు మొదలయ్యాక నిత్యం జరిగే లావాదేవీలను సర్వర్ లో భద్రపరుస్తుంటారు.  దశాబ్దాలుగా స్టోరేజీ కెపాసిటీని పెంచుకునే విషయంలో అధికారులు దృష్టి పెట్టడం లేదని విమర్శిస్తున్నారు.  దశాబ్దాల క్రితం ఉన్న స్టోరేజీ కెపాసిటీతోనే ఇప్పటికీ నెట్టుకొస్తున్నారు. ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున రవాణా శాఖలో ట్రాన్స్ జక్షన్ పెరగటంతో అందుకు దానికి విధంగా సర్వర్ ను అప్ డేట్ కాలేదని ఆర్టీఏ సిబ్బంది చెబుతున్నారు.  సర్వర్ కెపాసిటీ పెంచే అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు  ఒక అధికారి వెల్లడించారు.

 2 లక్షల మందికి ఇబ్బంది

సర్వర్ సమస్య కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2 లక్షల మంది ఇబ్బంది పడ్డారు. సోమవారం రోజున సాధారణంగా ఎక్కువ మంది స్లాట్ బుక్ చేసుకుంటారు. గత సోమవారం మాదిరిగానే ఈ సారి మళ్లీ సోమవారమే సర్వర్ లో సమస్య రావటంతో పెద్ద ఎత్తున వాహనదారులకు ఇబ్బందులు తప్పలేదు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 74 ఆర్టీఏ కార్యాలయాల దావరా 59 సేవలను ఆన్ లైన్ ద్వారానే అందిస్తున్నారు. వీటిలో ఎక్కువగా లెర్నింగ్, పర్మినెంట్ లైసెన్స్ కోసం స్లాట్ బుక్ చేసుకునే వారే  ఉంటారు.

రాష్ట్ర వ్యాప్తంగా రోజు 30 నుంచి 35 వేల వరకు లెర్నింగ్ లైసెన్సుల కోసం 20 వేల మందికి పైగా పర్మినెంట్ లైసెన్స్ ల కోసం స్లాట్ బుక్ చేసుకుంటారు. కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ దాదాపు 10 వేల వరకు ఉంటాయి.  వాహనాల ఫిట్ నెస్ ఓనర్ షిప్ సర్టిఫికెట్, ఎన్వోసీ వంటి సేవల కోసం రోజుకు 10 వేల మందికి పైగానే స్లాట్ బుక్ చేసుకుంటారు. మొత్తం 59 సేవలకు సంబంధించి రోజు 2 లక్షల మంది వరకు ఆర్టీఏ కార్యాలయాలు చుట్టు తిరుగుతుంటారు. వీరిలో చాలా వరకు ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు ఉన్నారు. వీరంతా ఆఫీసులకు, కాలేజ్ ల కు సెలవు పెట్టి మరీ స్లాట్ బుక్ చేసుకున్న సమయానికి ఆర్టీఏ కార్యాలయాలకు వస్తుంటారు. వారు మళ్లీ మరో రోజు సెలవు పెట్టాల్సిన పరిస్థతి నెలకొందని  ఫోటోస్ ఇవాళ్టి డేట్ సిటి స్టోరీస్ లో ఆర్టీఏ సర్వర్ పేరుతో ఉంటాయి.