వరంగల్, వెలుగు: కుడా భూముల వేలం పాటలో అవినీతి ఆరోపణల నేపథ్యంలో శుక్రవారం బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల తడిబట్టల స్నానాలతో భద్రకాళి ఆలయం వద్ద ఉద్రిక్తత నెలకొనగా, శనివారం ఆలయ సంప్రోక్షణ పేరుతో బీజేపీ చేపట్టిన కార్యక్రమం మరోసారి వాగ్వాదాలు, తోపులాటలకు దారితీసింది. పోలీసుల అడ్డంకులను దాటుకుని బీజేపీ శ్రేణులు ఆలయానికి చేరుకోగా, వారిని అడ్డుకునే క్రమంలో తోపులాట జరిగింది.
కుడా భూముల వేలంలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి తడిబట్టల స్నానం చేయగా, ప్రస్తుత కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి తడిబట్టల స్నానం, అమ్మవారి ఆలయంలో ప్రమాణం చేసి, సవాల్ విసిరారు. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఉద్రిక్తత నెలకొంది. ఆలయ పవిత్రత దెబ్బతిందని ఆరోపిస్తూ శనివారం బీజేపీ నేతలు పసుపు నీటితో సంప్రోక్షణ చేపట్టారు.
ఈ సందర్భంగా పోలీసులు పలువురు నేతలను గృహనిర్బంధం చేయగా, ఆలయం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ బీజేపీ కార్యకర్తలు ఆలయానికి చేరుకుని సంప్రోక్షణ చేపట్టడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదాలు, నినాదాలు, తోపులాటలు చోటుచేసుకున్నాయి. వరుసగా రెండో రోజు ఆలయం రాజకీయాలకు వేదిక కావడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భద్రకాళి ఆలయాన్ని రాజకీయ వేదికగా మార్చడం సిగ్గుచేటని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ అన్నారు.
