- సరిగా స్క్రాచ్ చేయకుండానే టికెట్ పడేసిన మహిళ
- 10 రోజుల తర్వాత గుర్తించిన షాప్ యజమాని.. మళ్లీ ఆమెకే ఇచ్చిండు
- అమెరికాలోని ఇండియన్ సంతతి ఫ్యామిలీపై పొగడ్తల వర్షం
న్యూయార్క్: ఎప్పుడూ అదే షాప్కు వచ్చే మహిళ. ఆ రోజు షాప్కు వచ్చి లాటరీ కొన్నది. లంచ్ చేసే తొందరలో దాన్ని సరిగా స్క్రాచ్ చేయకుండానే చూసింది. తనకు రాలేదని అక్కడే పడేసి వెళ్లిపోయింది. 10 రోజుల పాటు డస్ట్బిన్లో ఉన్న ఆ టికెట్ను షాపు యజమాని కొడుకు గమనించాడు. సరిగా స్క్రాచ్ చేయలేదని తీసి పూర్తిగా గీసి చూడగా అది రూ. 7 కోట్ల లాటరీ టికెట్ అని అర్థమైంది. కానీ ఆ డబ్బును షాప్ వాళ్లు తీసుకోలేదు. లాటరీ టికెట్ కొన్న మహిళ పని చేసే ఆఫీస్కు వెళ్లి మరీ ఆమెను షాప్కు పిలిచి ఆ టికెట్ ఇచ్చారు. అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రంలో జరిగిందీ సంఘటన. ఆ షాప్ను నడిపిస్తోంది ఇండియన్ సంతతికి చెందిన మౌనిష్ షా. ఆయన కొడుకు అభి.. ఆ లాటరీని చెత్త కుప్పలో చూశారు. ఆ టికెట్కే లాటరీ తగిలిందని తెలుసుకున్నప్పుడు ఆనందం పట్టలేకపోయానని అభి చెప్పారు.
టెస్లా కారు కొనుక్కుందామనుకున్నాడు.. కానీ
‘ఓ టెస్లా కారు కొనుక్కుందామని మొదట అనుకున్నా. కానీ తర్వాత ఆమె డబ్బులు ఆమెకే ఇద్దామని ఫిక్స్ అయ్యా’ అని షాప్ యజమాని కొడుకు అభి చెప్పాడు. ఆ తర్వాత విషయం తండ్రికి చెప్పడం, ఆయన ఇంట్లో వాళ్లను పిలిచి ఆ డబ్బును లాటరీ కొన్న లీ రోస్ ఫియెగాకు ఇచ్చేద్దామని చెప్పారు. అలా నిర్ణయం తీసుకోవడం అంత ఈజీగా జరగలేదని, రెండ్రోజులు తమకు నిద్ర పట్టలేదని మౌనిష్ చెప్పారు. చివరకు నిర్ణయం తీసుకున్నాక రోస్ ఆఫీస్కు అభి వెళ్లి ఆమెను షాప్కు పిలుచుకొచ్చాడు. తాను పడేసిన టికెట్కే లాటరీ తగిలిందని తెలుసుకొని ఆమె ఆనందం ఆపుకోలేకపోయారు. షాపు యజమాని మంచి మనసుకు కన్నీళ్లు పెట్టుకున్నారు. వాళ్లకు బోనస్ ఇస్తానని చెప్పారు. విషయం అందరికీ తెలియడంతో ఎంతోమంది ఫోన్ చేసి ఆ ఇండియన్ సంతతి కుటుంబాన్ని అభినందించారు.