- 3 లారీలు, 2 బైక్ లు, ఆటో, కారు..
- లారీల మధ్య ఇరుక్కున్న ఆటో.. డ్రైవర్ మృతి
మంథని, వెలుగు: పెద్దపల్లి జిల్లా, మంథని మండలం ఎగ్లాస్పూర్సమీపంలోని గాడుదులగండి గుట్టపై భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకేసారి ఏడు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. రెండు లారీల మధ్య ఆటో ఇరుక్కుపోవడంతో ఆటో డ్రైవర్అక్కడికక్కడే మృతి చెందాడు. కారు, రెండు మోటార్ బైకులపై వెళ్తున్న ఏడుగురు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. గాడుదులగండి గుట్ట వద్ద కాటారం వైపు నుంచి వస్తున్న లారీ బ్రేకులు ఫెయిల్అయ్యాయి. అదే సమయంలో మంథని నుంచి భూపాలపల్లికి ఒక ఆటో, దాని వెనకాలే మరో లారీ, ఆ వెనుకాలే రెండు బైకులు, కారు వెళ్తున్నాయి. ఆ కారు వెనుకాలే ఇంకో లారీ వస్తోంది. ఎదురుగా వస్తున్న లారీకి బ్రేకులు ఫెయిలవడంతో కంట్రోల్ తప్పింది. ఒక్కసారిగా దూసుకొచ్చి ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టుకుంటూ వచ్చి ఆటో వెనక వస్తున్న లారీని కూడా బలంగా ఢీకొట్టింది. దీంతో ఆటో వెనక వస్తున్న లారీ వెనకకు వెళ్లడంతో దాని వెనకే రెండు బైకులపై ఉన్నవాళ్లు గమనించి పక్కకు దూకేశారు. ఆ వెనకే వస్తున్న కారులోని వాళ్లు లారీని గమనించేలోపే లారీ కారుపైకి దూసుకెళ్లింది. ఇంతలోనే ఆ కారు వెనక వస్తున్న ఇంకో లారీ కారును బలంగా ఢీకొట్టింది. ఈ సంఘటనలో కారు బాగా ధ్వంసం అయినా, అందులోని నలుగురు వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదంలో ఆటో డ్రైవర్ చనిపోగా, తీవ్రంగా గాయపడిన ఒక యువకుడిని హాస్పిటల్ కు తరలించారు. లారీల మధ్య ఇరుక్కుపోయిన ఆటోను పోలీసులు ప్రొక్లైనర్ సాయంతో తీశారు. మృతిచెందిన ఆటో డ్రైవర్ ను భూపాలపల్లి జిల్లా జంగేడు మండలం పెద్దకుంటపల్లికి చెందిన వాంకుడోతు సుమన్గా గుర్తించారు. యాక్సిడెంట్ కారణంగా సుమారు గంట పాటు వాహనాలు కిలోమీటరు పొడవునా నిలిచిపోయాయి.