దిశ నిందితుల్ని పది రోజులు కస్టడీకివ్వండి

దిశ నిందితుల్ని పది రోజులు కస్టడీకివ్వండి

హైదరాబాద్, వెలుగు: దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితులను కస్టడీకివ్వాలని కోరుతూ షాద్​నగర్​ పోలీసులు కోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. నిందితులను అరెస్టు చేసిన రోజు టైంలేక పూర్తిగా విచారించలేక పోయామని అందులో పేర్కొన్నారు. ఈ కేసులో నిందితులు మహ్మద్​ అలియాస్​ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చింతకుంట చెన్నకేశవుల నుంచి కీలక ఆధారాలు సేకరించాల్సి ఉందన్నారు. బాధితురాలికి మద్దతుగా ప్రజలు ఆందోళన చేయడంతో నిందితుల నుంచి ఎవిడెన్స్​సేకరించలేకపోయామని కోర్టుకు తెలిపారు. బాధితురాలి ఫోన్​ను రికవరీ చేయాలని, నిందితుల స్టేట్​మెంట్స్​రికార్డ్​ చేయాలని పిటిషన్​లో పేర్కొన్నారు. సీన్​ రీకన్స్ స్ట్రక్షన్​తో పాటు నిందితుల నేరచరిత్ర, సైంటిఫిక్​ ఎవిడెన్స్​సేకరించేందుకు నిందితులను పది రోజుల కస్టడీకి అప్పగించాలని కోర్టును కోరారు.

క్రైమ్​సీన్​లో సెక్యూరిటీ ఎందుకు పెట్టలే..

బాధితురాలిని దహనం చేసిన ప్లేస్​తో పాటు హైవేపై సెక్యూరిటీ ఎందుకు ఏర్పాటు చేయలేదని కోర్టు పోలీసులపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్​ విచారణ సందర్భంగా జడ్జి ఈ కామెంట్స్​ చేశారు. నిందితుల అరెస్టు తర్వాత జరిగిన ప్రజా ఆందోళనను ప్రస్తావిస్తూ.. కస్టడీకి అప్పగిస్తే ఎక్కడ విచారిస్తారని కోర్టు ప్రశ్నించింది. విచారణ సందర్భంగా లా అండ్​ఆర్డర్​ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జడ్జి ఆదేశించినట్లు సమాచారం. దీనిపై మంగళవారం విచారణ జరిపి ఆదేశాలు జారీ చేస్తామని పేర్కొన్నారు.

నిందితుల తరఫున వాదించబోం

దిశ కేసులో నిందితులకు న్యాయ సహాయం చేయబోమని షాద్​నగర్​ బార్​ అసోసియేషన్​తో పాటు రంగారెడ్డి జిల్లా కోర్టు బార్‌‌ అసోసియేషన్‌‌ కూడా తీర్మానం చేశాయి. ఈ కేసును వీలైనంత త్వరగా ఫాస్ట్​ట్రాక్​ కోర్టుకు తరలించాలని కోరారు. బాధితురాలి ఫొటోతో వందల సంఖ్యలో లాయర్లు ర్యాలీ తీశారు. మరోవైపు, కస్టడీ పిటిషన్​ వేయడానికి పోలీసులు వచ్చారని తెలిసి జనం కోర్టు ముందు ఆందోళన చేశారు. నిందితులను వెంటనే ఉరి తీయాలంటూ నినాదాలు చేశారు.