- శంషాబాద్ ఎయిర్పోర్ట్కు దుండగుల ఈ మెయిల్
- తనిఖీలు చేపట్టిన సెక్యూరిటీ సిబ్బంది.. ఫేక్ మెసేజ్ అని తేల్చిన అధికారులు
- మెయిల్ పంపిన ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు
శంషాబాద్, వెలుగు : హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లే విమానాన్ని హైజాక్ చేస్తున్నామని శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బెదిరింపు ఈ మెయిల్ రావడం కలకలం రేగింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 111 మంది ప్యాసింజర్స్తో దుబాయ్ వెళ్లే విమానాన్ని హైజాక్ చేస్తున్నామని ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సీఐఎస్ఎఫ్ సిబ్బందికి బెదిరింపు మెయిల్ రావడంతో సెక్యూరిటీ సిబ్బంది అలర్ట్ అయ్యారు. దీంతో వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి, దుబాయ్ వెళ్లే విమానాన్ని ఆపి, తనిఖీలు నిర్వహించారు. అయితే, ఫ్లైట్లో అనుమానాస్పదంగా ఎవ్వరూ కనిపించకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
ఫేక్ మెయిల్ పంపిన నిందితులను అధికారులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. తిరుపతికి చెందిన బాదినేని, ఎల్.వినోద్కుమార్, పి.రాకేశ్ కుమార్లను అరెస్ట్ చేసి, విచారణ చేపట్టారు. అయితే, వీరిని కలవడానికి ఓ మహిళ వచ్చిందని, ఆమె ఎవరనే కోణంలో విచారణ చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. ఆ తర్వాత విమానంలోని 111 మంది ప్రయాణికులను అధికారులు మరో ఫ్లైట్లో దుబాయ్కు పంపించారు.