- అదానీ గ్రూప్ ఒక్కటే ఇండియా కాదు
- అది కంపెనీ సమస్య, వారే చూసుకుంటారు
- మార్కెట్ను నడిపించే పెద్ద అంశం..ఆర్బీఐ పాలసీ మీటింగ్
- గ్రోత్కు ఫిస్కల్ డెఫిసిట్ అడ్డంకి: శంకర్ శర్మ
బిజినెస్ డెస్క్, వెలుగు: అదానీ గ్రూప్ ఒక్కటే ఇండియా కాదని, టాటా, బిర్లా, అంబానీ వంటి పెద్ద గ్రూప్లున్నాయని సీనియర్ ఇన్వెస్టర్ శంకర్ శర్మ పేర్కొన్నారు. హిండెన్బర్గ్ రిపోర్ట్ ఇచ్చింది ఇండియాపై కాదని, అదానీ గ్రూప్ పైన అని గుర్తు చేశారు. ఇది కంపెనీ సమస్య అని, ఇండియా సమస్య కాదని అన్నారు. దుబాయ్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో పాల్గొన్న ఆయన ఇన్ఫ్లేషన్, గ్రోత్, రిస్క్, జార్జ్ సోరస్ వంటి వివిధ అంశాలపై మాట్లాడారు. మిగిలిన విషయాలు ఆయన మాటల్లోనే..
ఇండియన్ మార్కెట్ను నడిపించే అంశాలు ఏంటి?
మార్కెట్ను ప్రభావితం చేసే పెద్ద అంశం ఆర్బీఐ పాలసీ మీటింగ్ అవుతుంది. వడ్డీ రేట్లు పెరగడం వలన రూరల్, అర్బన్ ఇండియాలలో డిమాండ్ తగ్గుతోంది. ఏషియన్ పెయింట్స్ వంటి కన్జూమర్ కంపెనీల నెంబర్లను చూస్తే డిమాండ్ తగ్గుతున్న విషయం తెలుస్తుంది. రానున్న ఎంపీసీ మీటింగ్లో మానిటరీ పాలసీని ఆర్బీఐ డోవిష్ (రేట్లు తగ్గిస్తామనే) సంకేతాలు ఇస్తుందని అంచనావేస్తున్నా.
గ్లోబల్గా ఇన్ఫ్లేషన్ భయాలున్నాయా?
ఇన్ఫ్లేషన్ సమస్యలున్నాయి. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ఇప్పటిలో ఆగేటట్టు కనిపించకపోవడం ఇందుకొక కారణం. యుద్ధం వలన ప్రొడక్ట్ల ధరలు గరిష్టాల్లో మరికొంత కాలం పాటు కొనసాగుతాయి. మరోవైపు యూఎస్, ఇండియా సెంట్రల్ బ్యాంకులు ధరలను తగ్గించడంపై కంటే గ్రోత్పై ఎక్కువ ఫోకస్ పెట్టాయి. దీని ప్రభావం ప్రస్తుతం కనిపిస్తోంది. ఇన్ఫ్లేషన్ ఊహించిన దాని కంటే పెద్ద సమస్యగా మారింది
అదానీ- హిండెన్బర్గ్ ఇష్యూ గురించి ఏమంటారు?
హిండెన్బర్గ్ రిపోర్ట్ ఇండియాపై కాదు, ఒక కార్పొరేట్ గ్రూప్పై ఇచ్చినది. దేశంలో మరే కంపెనీలు లేనట్టు ఈ రెండు అంశాలను ఎందుకు కలుపుతున్నారో అర్థం కావడం లేదు. టాటా గ్రూప్, బిర్లా గ్రూప్, అంబానీ గ్రూప్ వంటి గొప్ప కార్పొరేట్ హౌస్లున్నాయి. ఆ ఒక్క కంపెనీ దేశంలోని అన్ని కంపెనీలకు సమానమని ఏలా చెబుతున్నారు? ఒక గ్రూప్ తప్పుడు కారణాలతో వార్తల్లో ఉంది. పెరిగేటప్పుడు రైట్ కారణాలతో వార్తల్లో నిలిచింది. ఈ సమస్యను వారే పరిష్కరించుకుంటారు. ఇది వారి సమస్య. ఇండియా సమస్య కాదు. ఎకానమీపై జార్జ్ సోరస్ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం. ఇండియా గ్రోత్కు పెద్ద అడ్డంకి ఫిస్కల్ డెఫిసిట్. ప్రస్తుతం 6 శాతం ఫిస్కల్ డెఫిసిట్ ఉంది.
కొత్త తరం కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తారా?
తాజాగా కొత్త తరం టెక్ కంపెనీల షేర్లు 60-70 శాతం క్రాష్ అయ్యాయి. కానీ, ఇన్వెస్టర్లు ఒక విషయాన్ని మిస్ అవుతున్నారు. రూ.100 దగ్గర ఉన్న షేరు రూ.30 కి పడితే అంటే 70 శాతం క్రాష్ అయినంత మాత్రాన ఆ షేరుకి రూ.100 వాల్యూ పెట్టొచ్చని కాదు. ఇటువంటి షేర్లు మార్కెట్లో లిస్టింగ్ అవ్వాల్సిందే రూ.20 దగ్గర. నా అభిప్రాయం ప్రకారం ఈ కంపెనీల షేర్లు మరో 50 శాతం, బహుశా 80 శాతం తగ్గాలి. డబ్బులు వృధా చేయాలనుకుంటే చాలా మార్గాలున్నాయి. ఇటువంటి పనికిమాలిన షేర్లను కొనుగోలు చేయడం కంటే ఆ డబ్బులతో బాగా తినండి, తాగండి.
రూ.10 లక్షలుంటే ఎలా ఇన్వెస్ట్ చేయాలి?
బాగా రీసెర్చ్ చేసి ఓ 50 లేదా 30 స్మాల్ క్యాప్ షేర్లను ఎంచుకోండి. ప్రతీ దానిలో సమానంగా ఇన్వెస్ట్ చేయండి. ఇదొక మారథాన్ అనుకోండి. అంటే 30 రన్నర్లు ఇప్పుడు స్టార్టింగ్ లైన్ దగ్గరున్నారు. ఓ ఐదు మైళ్లు పూర్తయ్యాక 5–10 మంది రేస్లో ముందుంటారు. మధ్యలో ఓ 15–18 మంది, చివరిలో ఓ 5 మంది ఉంటారనుకుందాం. చివరిలోని వారిని తొలగించేయండి. ఆ డబ్బులను తిరిగి కొత్త వాటిలో పెట్టడమా లేదా రేస్లో ముందున్న వారిలో పెట్టడం చేయండి. ఇలా అయితేనే మార్కెట్లో మనీ సంపాదించగలుగుతారు. మూడు నాలుగేళ్లలో ఈ 30 షేర్లలో 5 భారీ రిటర్న్స్ ఇస్తాయని అంచనా వేయొచ్చు. ఇన్వెస్టర్ 30–40 శాతం కంటే ఎక్కువ అమౌంట్ను షేర్లలో పెట్టకూడదని నమ్ముతా. ఫిక్స్డ్ ఇన్కమ్ అసెట్లలో ఇన్వెస్ట్ చేయండి.