
తెలంగాణ కొత్త సీఎస్ ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. కొత్త సీఎస్ గా శాంతికుమారిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది.1989 బ్యాచ్కు చెందిన శాంతికుమారి గతంలో సీఎంవోలో కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్పెషల్ సీఎస్ గా ఉన్నారు. ఈమె ఏప్రిల్ 2025లో రిటైర్ కానున్నారు. రాష్ట్రంలో తొలిసారిగా మహిళా సీఎస్ ని ప్రభుత్వం నియమించింది. తనకు సీఎస్ గా అవకాశం కల్పించినందుకు ప్రగతిభవన్ లో సీఎం కేసిఆర్ గారిని కలిసి శాంతికుమారి ధన్యవాదాలు తెలిపారు.
ఎమ్మెస్సీ మెరైన్ బయాలజీ చదివిన శాంతికుమారి అమెరికాలో ఎంబిఏ కూడా పూర్తి చేశారు. గత మూడు దశాబ్దాలుగా ఐఏఎస్ గా పేదరిక నిర్మూలన, సమ్మిళిత అభివృద్ధి, విద్య, వైద్య ఆరోగ్య రంగాలు, స్కిల్ డెవలప్ మెంట్, అటవీశాఖల్లో వివిధ హోదాల్లో సేవలందించారు. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమాల్లో రెండేళ్లపాటు పనిచేశారు. గతంలో నాలుగేళ్లపాటు సీఎం కార్యాలయంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా, టీఎస్ ఐపాస్ లో ఇండస్ట్రీ ఛేజింగ్ సెల్ స్పెషల్ సెక్రటరీగా కూడా సేవలందించారు.