జగన్ ప్రత్యర్థితో దోస్తీ.. బీటెక్ రవితో బ్రదర్ అనిల్‌ భేటీ  

జగన్ ప్రత్యర్థితో దోస్తీ.. బీటెక్ రవితో బ్రదర్ అనిల్‌ భేటీ  

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. వైఎస్సార్టీపీ అధినేత్రి, రాజన్న బిడ్డ షర్మిల ఎంట్రీతో ఏపీ రాజకీయ సమీకరణాలు అనూహ్యంగా మారుతున్నాయి. పాత లెక్కలు కనుమరుగై కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. ఒకవైపు షర్మిల తన అన్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలవబోతుంటే.. మరోవైపు ఆమె భర్త టీడీపీ నేతతో భేటీ అయ్యారు.

వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్.. పులివెందుల టీడీపీ ఇన్‌చార్జ్ బీటెక్ రవితో భేటీ అయ్యారు. కడప ఎయిర్‌పోర్టులో ఈ సన్నివేశం చోటుచేసుకుంది. ఫ్లైట్ టేకాఫ్ అవ్వడానికి ఆలస్యమవడంతో వీరిద్దరి కలయిక జరిగినట్లు తెలుస్తోంది. అనంతరం వీరిద్దరూ ఒకే ఫ్లైట్‌లో గన్నవరం బయలుదేరి వెళ్లారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీరి పక్కన మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణ రెడ్డి కూడా ఉన్నారు. జగన్ ప్రత్యర్థి అయినటువంటి బీటెక్ రవితో బ్రదర్ అనిల్‌ భేటీ అవ్వడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతోంది.

జగన్‌ను కలవనున్న షర్మిల

మరోవైపు షర్మిల తాడేపల్లి ప్యాలెస్‌లో తన అన్న జగన్‌ను కలవనున్నారు. ఇప్పటికే కుటుంబ సమేతంగా గన్నవరం చేరుకున్న ఆమె.. కాసేపట్లో ఏపీ సీఎం జగన్ ఇంటికి వెళ్లనున్నారు. ఫిబ్రవరి 17న షర్మిల కుమారుడి వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో షర్మిల.. తన  అన్నకు వివాహ ఆహ్వాన పత్రిక అందజేసి.. ఆహ్వానించనున్నారు. ఈ కలయిక అనంతరం షర్మిళ ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నట్లు సమాచారం.