- ఖర్గే సమక్షంలో పార్టీలో చేరనున్న షర్మిల
న్యూఢిల్లీ, వెలుగు : వైఎస్సార్టీపీ గురువారం కాంగ్రెస్ పార్టీలో విలీనం కానుంది. ఢిల్లీలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆ పార్టీలోకి షర్మిల చేరనున్నారు. ఈ మేరకు విజయవాడ నుంచి కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం రాత్రి ఢిల్లీకి ఆమె చేరుకున్నారు. అంతకుముందు ఏపీలోని తాడేపల్లిగూడెంలో తన భర్త అనిల్తో కలిసి ఏపీ సీఎం వైఎస్ జగన్తో ఆమె భేటీ అయ్యారు. తన కుమారుడు రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను జగన్కు అందజేశారు. కాగా, గురువారం ఉదయం ఏఐసీసీ హెడ్ ఆఫీసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ
జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో షర్మిల ప్రత్యేకంగా భేటీ కానున్నారు. తన కుమారుడి పెండ్లి పత్రికను నేతలకు అందజేయనున్నట్లు సమాచారం. తర్వాత ఉదయం 11 గంటలకు ఖర్గే సమక్షంలో షర్మిల తన పార్టీని కాంగ్రెస్లో మెర్జ్ చేయనున్నారు. షర్మిలకు కీలక బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం. త్వరలో ఏపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ దక్షిణాది రాష్ట్రాల ఎన్నికల ఇన్చార్జ్గా ఆమెను నియమించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.