
మంచి ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా ‘షష్టిపూర్తి’ చిత్రాన్ని తీశాను అన్నాడు దర్శకుడు పవన్ ప్రభ. రాజేంద్ర ప్రసాద్, అర్చన ప్రధాన పాత్రల్లో రూపేష్ హీరోగా నిర్మాతగా రూపొందించిన ఈ సినిమా మే 30న విడుదలవుతోంది. ఈ సందర్భంగా డైరెక్టర్ పవన్ ప్రభ మాట్లాడుతూ ‘మాది ఉమ్మడి కుటుంబం. నాకు అందరి ప్రేమ తెలుసు. తాతయ్య, అమ్మమ్మ, నానమ్మ, పిన్నమ్మ, పెద్దమ్మ, మేనత్త ఇలా అందరి మధ్య పెరిగాను. కానీ ఇప్పుడు కొందరికి అమ్మానాన్నలు బరువు అవుతున్నారు. నడి రోడ్డు మీద వారిని వదిలేస్తున్నారు. అమ్మా నాన్నల విలువ, వారి ప్రేమ, గొప్పదనాన్ని చాటి చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ సినిమా తీశా. ఓ జోవియల్ ఫాదర్ ఎలా ఉండాలో అలా రాజేంద్ర ప్రసాద్ గారిని చూపించాను.
అలాగే స్ట్రిక్ట్ మదర్గా అర్చన గారు కనిపిస్తారు. గోదావరి ఒడ్డున ఈ కథ ఉంటుంది.. అలాంటి కథకు ఇళయరాజా గారు సంగీతం బాగుంటుంది అనుకున్నా. ఆయన ఒప్పుకోవడం మా అదృష్టం. ఇళయరాజా గారి గురించి బయట వినేవన్నీ తప్పు. ఆయన మాకు ఒక పాట కోసం ఎన్నో ట్యూన్లు ఇచ్చారు. ఇందులో కీరవాణి గారు ఓ పాటకు లిరిక్స్ అందించారు. ఇదొక మ్యూజికల్ జర్నీగా సాగుతుంది. రూపేష్ హీరోగా నటిస్తూ నిర్మించడం చాలెంజింగ్గా తీసుకున్నారు. ఆకాంక్ష అచ్చమైన తెలుగు అమ్మాయి పాత్ర పోషించింది. చక్కని ఎమోషనల్ డ్రామాగా ఫ్యామిలీ ఆడియన్స్ను ఆకట్టుకుంటుంది’ అని చెప్పాడు.