ఆకతాయిలూ.. మీ పనైపోయినట్టే..! నిమజ్జనోత్సవంలో ఈవ్ టీజర్స్ పని పట్టేందుకు షీటీమ్స్ రెడీ

ఆకతాయిలూ.. మీ పనైపోయినట్టే..! నిమజ్జనోత్సవంలో ఈవ్ టీజర్స్ పని పట్టేందుకు షీటీమ్స్ రెడీ
  • ఇప్పటికే బడా గణేశ్​ పరిసరాల్లో ప్రత్యేక నిఘా  
  • మహాగణపతి దగ్గర గతేడాది వెయ్యి మంది పట్టివేత 
  • ఈ ఏడాది బోనాల ఉత్సవాల్లో 650 మంది అదుపులోకి..

హైదరాబాద్ సిటీ, వెలుగు:  పండగల సమయంలో బయటకు వచ్చే మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఆకతాయిలపై షీ టీమ్స్ ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నది. గతంలోనూ ప్రత్యేక డ్రైవ్‌‌‌‌లు నిర్వహించి వందలాది మందిని రెడ్ హ్యాండెడ్‌‌‌‌గా పట్టుకున్న షీ టీమ్స్.. ఈసారి కూడా గణేశ్ నవరాత్రుల సందర్భంగా వారి పని పట్టేందుకు సిద్ధమైంది. కొందరు మగవాళ్లు రద్దీ ఉన్న ప్రాంతాల్లో మహిళల వెనక, పక్కన నడుస్తున్నట్టు నటిస్తూ వారిని ఎక్కడ పడితే అక్కడ తాకడం, అసభ్యకర కామెంట్స్, ​సైగలు, ఇతర పనులతో వారిని ఇబ్బందులు పెడుతూ ఉంటారు. 

ఈ విషయాన్ని పోలీసులకు కంప్లయింట్​చేద్దామంటే సాక్ష్యం ఉండదు. అందుకే, ఈవ్​టీజర్స్​ను రెడ్​హ్యాండెడ్​గా పట్టుకునేందుకు షీ టీమ్స్ ఎంటరయ్యాయి. తెలంగాణ పోలీస్​ డిపార్ట్‌‌‌‌మెంట్​లో భాగంగా 2014లో ఏర్పాటైన షీటీమ్స్​ప్రతిభావంతంగా పని చేస్తున్నాయి. వీరు సివిల్​డ్రెస్సుల్లో ఉండి పబ్లిక్ ప్లేసుల్లో సీక్రెట్​కెమెరాలు, మొబైల్స్​పట్టుకుని మహిళలను వేధిస్తుండగా, వీడియోలు తీసి శిక్షలు, జరిమానాలు విధిస్తున్నారు. ముఖ్యంగా పండగలు, జాతరలు, పబ్లిక్ ఈవెంట్లలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతాయని స్పెషల్​డ్రైవ్స్​నిర్వహిస్తున్నాయి. అయితే, పట్టుబడుతున్న ఆకతాయిల సంఖ్య ఏ ఏడాదికా ఏడాది పెరుగుతుండడం కలవరపెడుతున్నది.  

 2024 ఖైరతాబాద్ గణేశ్ పరిసరాల్లో 996 మంది  

గతేడాది గణేశ్ నవరాత్రుల సమయంలో హైదరాబాద్​లోని ఖైరతాబాద్ బడా గణేశ్ పరిసరాలు, నిమజ్జన మార్గాలు, మండపాల వద్ద షీ టీమ్స్ అప్రమత్తంగా పనిచేశాయి.11 రోజుల పాటు కొనసాగిన ఈ ఉత్సవాల్లో మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న 996 మందిని రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు. ఇందులో ఎక్కువ మంది యువకులు, మైనర్లే ఉన్నారు. గతేడాది ఖైరతాబాద్ బడా గణేశ్ దగ్గరనే 285 మందిని పట్టుకున్నారు. వీరిలో 200 మందికి కోర్టు మూడు రోజుల జైలు శిక్ష విధించింది. మిగిలిన వారికి కౌన్సెలింగ్, జరిమానాలు విధించి వార్నింగ్ ఇచ్చి వదిలేశారు.  

 2025 బోనాల పండుగలో 644  

ఈ ఏడాది బోనాల పండుగ సమయంలో కూడా షీ టీమ్స్ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాయి. గోల్కొండ, బల్కంపేట ఎల్లమ్మ, సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి ఆలయాలు వంటి కీలక ప్రాంతాల్లో నిఘా తీవ్రతరం చేశాయి. ఈ పండగలో మహిళలపై వేధింపులకు పాల్పడిన 644 మందిని (552 మంది పెద్దవారు, 92 మంది మైనర్లు) పట్టుకున్నారు. ఇందులో ఐదుగురికి ఏడు రోజుల జైలు శిక్ష పడింది. బోనాలు, మొహర్రం పండగల వేళల్లో 478 మందిని పట్టుకున్నారు.  

ఈసారీ ప్రత్యేక నిఘా

ఈ గణేశ్ నవరాత్రుల సందర్భంగా షీ టీమ్స్ మరింత అప్రమత్తంగా ఉన్నాయి.  వందల సంఖ్యలో ఆకతాయిలు పట్టుబడుతుండడంతో ఖైరతాబాద్, హుస్సేన్‌‌‌‌సాగర్ నిమజ్జన మార్గాలు,  మండపాలు, జంక్షన్ల వద్ద సివిల్​దుస్తుల్లో పోలీసులను నిఘాలో పెట్టారు. సీసీటీవీ కెమెరాలు, డ్రోన్ల సాయంతో మానిటరింగ్ చేస్తున్నారు.

 ‘మహిళల భద్రత మా ప్రాధాన్యత. ఆకతాయిలు ఎవరైనా సరే పట్టుకుని శిక్షించకుండా వదలం’ అని హైదరాబాద్ సిటీ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆకతాయిలకు ముందస్తు వార్నింగ్ ఇస్తూ, ‘పండగలు ఆనందంగా జరుపుకోండి, కానీ అసభ్య ప్రవర్తనకు పాల్పడితే జైలు శిక్ష తప్పదు’ అని హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. ఎవరైనా వేధిస్తే 100 లేదా 1098 హెల్ప్‌‌‌‌లైన్‌‌‌‌కు కాల్ చేయాలని కోరుతున్నారు