
హైదరాబాద్: గాంధీ భవన్లోకి గొర్లను పంపి గొర్ల కాపరుల సంక్షేమ సంఘం వినూత్నంగా నిరసన తెలిపింది. 40 లక్షలకు పైగా వున్న యాదవ కురుమలకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గాంధీ భవన్ను జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి సోమవారం ఉదయం ముట్టడించింది. దీంతో.. గాంధీభవన్ దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ట్రాఫిక్ స్తంభించింది.
పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళన చేస్తున్న వారిని అక్కడ నుంచి తరలించారు. సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న శాఖల నుంచే కొన్నింటిని ముగ్గురు కొత్త మంత్రులకు కేటాయించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సీఎం దగ్గర ఇంకా 7 శాఖలు (ఎడ్యుకేషన్, హోం, జీఏడీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, కమర్షియల్ ట్యాక్స్, లా, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్) ఉన్నాయి.
గొల్ల, కురమల నుంచి ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పలుమార్లు గొల్ల, కురుమలు నిరసనలు తెలిపిన సంగతి తెలిసిందే. ఎన్నడూ గొల్లకుర్మలు లేకుండా మంత్రి వర్గం లేదని ఐలయ్య కూడా గతంలో తన అభిప్రాయాన్ని బయటపెట్టిన సంగతి తెలిసిందే.
గొల్ల కుర్మల ప్రతినిధిగా తనకు అవకాశం కల్పించాలని గతేడాది సీఎం, డిప్యూటీ సీఎంను కలిసి అభ్యర్థించారు. ఏపీలో ముగ్గురికి మంత్రి వర్గంలో ఛాన్స్ ఇచ్చారని ఆ సందర్భంలో బీర్ల ఐలయ్య గుర్తుచేశారు. 50 లక్షల పై చిలుకు జనాభా వున్న గొల్లకుర్మలకు ప్రభుత్వంలో పదవులు ఇవ్వాలని ఆయన చెప్పారు.