లండన్: వరల్డ్ కప్ లో జోరుమీదున్న టీమిండియాకు బ్యాడ్ న్యూస్. ఓపెనర్ శిఖర్ ధావన్ 3వారాలపాటు టీమ్ కు దూరం కానున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో ధావన్ చేతి వేలికి గాయమైంది. టీమ్ యాజమాన్యం అతడి ఎడమచేతి బొటన వేలుకు మంగళవారం స్కానింగ్ చేయించింది. దీంతో మూడు వారాల పాటు విశ్రాంతి అవసరమని తెలిపారు డాక్టర్లు. దీంతో టీమిండియాకు ప్రపంచకప్లో ఎదురుదెబ్బ తగిలినట్లైంది. అతడి స్థానంలో యంగ్ ప్లేయర్ రిషభ్పంత్కు చోటుదక్కే అవకాశం కనిపిస్తోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
ఆస్ట్రేలియాతో మ్యాచ్లో కౌల్టర్నైల్ విసిరిన బాల్ గబ్బర్ చేతికి బలంగా తగిలింది. నొప్పితో ఇబ్బంది పడినా 109 బాల్స్ లో 117 రన్స్ చేసి టీమ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే నొప్పి వల్ల ఆసీస్ మ్యాచ్లో గబ్బర్ ఫీల్డింగ్ చేయలేదు. అతడి స్థానంలో 50 ఓవర్లు రవీంద్ర జడేజా ఫీల్డింగ్ చేశాడు. టీమిండియా గురువారం న్యూజిలాండ్తో తలపడనుంది. ఆ మ్యాచ్లో రోహిత్కు జోడీగా ఎవరు ఓపెనింగ్ చేస్తారో తెలియాల్సి ఉంది.