లడఖ్లో సీన్ మారింది
చైనా సైన్యానికి షాక్.. మన ఆర్మీ ప్లాన్కు డ్రాగన్ బోల్తా
కీలక ఏరియాలు మన సైనికుల కంట్రోల్లో..
దెబ్బకు దిగొచ్చిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ
ఆగస్టులో జరిగిన ఆపరేషన్ వివరాలు వెలుగులోకి..
న్యూఢిల్లీ: బార్డర్లో లొల్లి లొల్లి జేసిన చైనా కొన్ని రోజుల తర్వాత దూకుడు తగ్గించింది.. యుద్ధానికి సిద్ధమన్నట్లు హడావుడి చేసి చివరకు సల్లవడ్డది. దీనికి మన సైనికుల శక్తియుక్తులతో పాటు ఆగస్టు నెలలో కొంతమంది సైనికుల టీమ్తో ఆర్మీ నిర్వహించిన సీక్రెట్ ఆపరేషనే కారణం. రెండు రోజుల పాటు అత్యంత సీక్రెట్గా చేసిన ఈ ఆపరేషన్తో ప్యాంగాంగ్ త్సో నది ఒడ్డున సీన్ మొత్తం మారిపోయిందట. చైనాను ఇరుకున పెట్టి, బేరసారాలాడే శక్తిని మనకు కట్టబెట్టిన ఈ ఆపరేషన్ కోసం ఆర్మీ ఉన్నతాధికారులు నెల రోజుల పాటు ప్లాన్ చేశారట. దానిని పకడ్బందీగా అమలు చేసి, చైనా ఆర్మీతో పాటు ఆ దేశం శాటిలైట్ల కన్నుగప్పి బార్డర్లోని కీలక ప్రాంతాల్లోకి మన సైనికులు చేరుకున్నరని సైనిక వర్గాల సమాచారం. ఆగస్టులో జరిగిన ఈ ఆపరేషన్వివరాలను ‘ది ప్రింట్’ ఓ కథనాన్ని ప్రచురించింది.
నెల రోజుల ప్లానింగ్..
లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్(ఎల్ఏసీ)ను దాటి మన భూభాగాన్ని ఆక్రమించేందుకు మొన్నటి మే, జూన్ నెలల్లో చైనా చేసిన ప్రయత్నాన్ని మన సైనికులు విఫలం చేశారు. జూన్ 15న బార్డర్లో రెండు దేశాల సైనికులు కొట్టుకున్నరు. ఈ గొడవలో మన సైనికులు 20 మంది చనిపోగా.. చైనా వైపు కూడా పెద్ద సంఖ్యలోనే ప్రాణ నష్టం జరిగింది. ఈ గొడవ తర్వాత బార్డర్లో టెన్షన్స్ పెరగిపోయినయ్. చైనా పెద్ద సంఖ్యలో బలగాలను బార్డర్కు తరలించడంతో మన ఆర్మీ కూడా బలగాలను మోహరించింది. చైనా తీరు చూస్తుంటే వెనక్కి తగ్గేలా కనిపించట్లేదని తేలిపోయింది. డ్రాగన్ కంట్రీతో చర్చలు జరపడానికి ఓ బార్గెయినింగ్ పవర్ను సంపాదించాలని ఢిల్లీ నుంచి ఆర్మీకి సూచనలు అందాయి. దీంతో బార్డర్ వెంబడి పట్టు పెంచుకునేందుకు ఏర్పాట్లు మొదలైనయ్. ఎల్ఏసీ వెంబడి ఆరేడు ఏరియాలను గుర్తించి, అందులో ఏయే ప్రాంతాలను మన కంట్రోల్లోకి తెచ్చుకుంటే చైనా దారికొస్తుందనే దిశగా అధికారులు ఆలోచన చేశారు. దాదాపు నెలపాటు ప్లాన్ చేసి, సీక్రెట్గా అమలుచేశారు.
బలగాల మోహరింపు..
ఈస్టర్న్ లడఖ్లో చైనా దూకుడు నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేలా ఆర్మీ జాగ్రత్తలు తీసుకుంది. చైనా సైన్యానికి ధీటుగా దాదాపు 40 వేల అదనపు బలగాలను బార్డర్కు తరలించింది. వెపన్స్, మందుగుండు సామగ్రి, యుద్ధ ట్యాంకులను మోహరించింది. ఓవైపు ఈ పనులు చేస్తూనే సీక్రెట్ ఆపరేషన్ను కొనసాగించింది. ఆగస్టు 29, 30.. రెండు రోజుల్లో వేర్వేరు చోట్లకు చేరిన సైనిక బలగాలను టార్గెట్మౌంటెయిన్ పైకి చేర్చింది. ఆయుధాలనూ విజయవంతంగా ప్యాంగ్యాంగ్ త్సో నది దక్షిణ తీరానికి తరలించింది. అక్కడున్న పర్వతాలలో కైలాశ్ రేంజ్ను మన సైనికులు కంట్రోల్లోకి తెచ్చుకున్నరు. దీంతో చైనా ఆధీనంలోని స్పాంగ్గూర్ గ్యాప్, మోల్డో గారిసన్ ఏరియాలపై మనదే పైచేయిగా మారింది. చైనాతో బేరసారాలకు ఇది ఎంతో కీలకంగా మారింది. ఈ ఆపరేషన్ తర్వాత చైనా దూకుడు తగ్గించుకుని, చర్చలకు ముందుకొచ్చింది. బార్డర్లోని బలగాలను వెనక్కి పిలిపించుకుందామని ప్రతిపాదించింది.
24 గంటల నోటీసు.. ఒక్కటే విమానం..
ఆగస్టు నెల ప్రారంభంలో జస్ట్ 24 గంటల నోటీసుతో మౌంటెయిన్ స్ట్రైక్ కోర్(ఎంఎస్సీ) టీమ్ను ఆర్మీ అధికారులు సిద్ధం చేశారు. పర్సనల్ వస్తువులు తప్ప ఇతరత్రా వేటినీ తీసుకెళ్లొద్దని సూచించారు. జనరల్ ఆఫీసర్ కమాండిగ్, లెఫ్టినెంట్ జనరల్ సన్వీత్ సింగ్ ఆధ్వర్యంలో వారందరినీ ఒక్కటే విమానంలో లడఖ్ తరలించారు. బలగాలు, విమానాల కదలికలను చైనా శాటిలైట్ల దృష్టిని ఆకర్షిస్తాయనే ఉద్దేశంతో ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లు అధికార వర్గాల సమాచారం. ఇందులో భాగంగానే చైనా ఆర్మీని తప్పుదోవ పట్టించేందుకు ఇతర ప్రాంతాలపై ఫోకస్ పెట్టినట్లు షో చేశారు. ఎవరికీ అనుమానం రాని రీతిలో ఎంఎస్సీ(17 కోర్)కు చెందిన కొద్దిమంది సైనికులతో ఓ టీమ్ టార్గెట్ దిశగా బయలుదేరింది. వారి వెంట రెగ్యులర్ గా ఉండే వెపన్స్ తప్ప పెద్ద సంఖ్యలో శత్రువులు ఎదురైతే పోరాడేందుకు అవసరమైన ఆయుధాలు లేవు. కానీ అందులోని సైనికులు అందరూ పర్వతాలు ఎక్కడంలో బాగా అనుభవం ఉన్నోళ్లే. ఒకవైపు ఈ టీం టార్గెట్వైపు సాగుతుంటే.. లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్ నేతృత్వంలో ని 14 కోర్కు చెందిన మరో టీమ్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) సైనికుల దృష్టిని తమపైనే కేంద్రీకృతం అయ్యేలా చూసుకుంది.
ఫింగర్ 4 పైకి మన సైనికులు..
పీఎల్ఏ కంట్రోల్లో ఉన్న ఫింగర్ 4 పైనా పట్టు సాధించేందుకు పారా ఎస్ఎఫ్ టీమ్ ఒకటి మరో ఆపరేషన్ చేపట్టింది. చైనా సైన్యం కళ్లుగప్పి పింగర్ 4 శిఖరంపైకి ఈ టీమ్ మెంబర్లు చేరుకున్నరు. చైనా సైనికుల క్యాంప్ క్లియర్గా కనిపించే ఎత్తుకు చేరుకుని, అక్కడ టెంట్ వేసుకున్నరు. చైనా క్యాంప్తో పాటు చుట్టుపక్కల ఏరియాకు సంబంధించి ఫొటోలు తీసుకున్నరు. మన సైడ్ నుంచి అక్కడికి చేరుకోవడానికి కొత్త మార్గాన్ని వెతికి, బలగాలను, ఆయుధాలను తరలించారు. దీంతో చైనా పూర్తిగా తగ్గిపోవాల్సి వచ్చింది. చైనా సైన్యంతో చర్చల సందర్భంగా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వెంట కీలకమైన ఏరియాలు మన కంట్రోల్లోనే ఉన్నాయని అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే.
For More News..