ముహూర్తం టైంకు వధువు జంప్.. వద్దన్నా వినకుండా మళ్లీ ఆమెనే పెళ్లి చేసుకున్నాడు.. పాపం చివరికి..

ముహూర్తం టైంకు వధువు జంప్.. వద్దన్నా వినకుండా మళ్లీ ఆమెనే పెళ్లి చేసుకున్నాడు.. పాపం చివరికి..

గద్వాల, వెలుగు: మేఘాలయలో జరిగిన హనీమూన్‌‌‌‌ మర్డర్‌‌‌‌ తరహా ఘటనే గద్వాల జిల్లాలో వెలుగు చూసింది. ప్రియుడి మోజులో పడి పెండ్లి అయిన నెల రోజులకే భర్తను హత్య చేయించిన యువతి తర్వాత ఏమీ తెలియనట్లు అతడి ఇంట్లోనే ఉండిపోయింది. అబ్బాయి కనిపించకుండా పోవడంతో కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయగా.. పోలీసుల ఎంక్వైరీలో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. వివరాల్లోకి వెళ్తే... గద్వాల పట్టణంలోని గంటగెరికి చెందిన జయరాములుకు తేజవర్దన్‌‌‌‌, తేజేశ్వర్‌‌‌‌ (32) ఇద్దరు కొడుకులు. రెండో కొడుకు తేజేశ్వర్‌‌‌‌ లైసెన్సుడు సర్వేయర్‌‌‌‌గా పనిచేస్తున్నాడు.

ఇతడికి కర్నూల్‌‌‌‌లోని కల్లూరు ఎస్టేట్‌‌‌‌కు చెందిన ఐశ్వర్యతో గతంలో పెండ్లి కుదిరింది. ఫిబ్రవరి 13న పెండ్లి జరగాల్సి ఉండగా... ముహూర్తానికి ముందు ఐశ్వర్య కనిపించకుండా పోవడంతో పెండ్లి ఆగిపోయింది. కొన్ని రోజుల తర్వాత ఐశ్వర్య.. తేజేశ్వర్‌‌‌‌కు ఫోన్‌‌‌‌ చేసి తన తల్లి కట్నం ఇవ్వకపోవడం వల్లే పెండ్లి ఆగిపోయిందని, తనకు ఎవరితోనూ ఎఫైర్‌‌‌‌ లేదని నమ్మించింది. దీంతో తాను ఐశ్వర్యనే చేసుకుంటానని తేజేశ్వర్‌‌‌‌ తన కుటుంబసభ్యులకు చెప్పడంతో వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినా వినకుండా మే 17వ తేదీన బీచుపల్లి ఆంజనేయస్వామి ఆలయం దగ్గర ఐశ్వర్యను పెండ్లి చేసుకున్నాడు. తర్వాత గద్వాలకు వచ్చి అక్కడే ఉంటున్నారు. ఈ క్రమంలో కుటుంబంలో చిన్న చిన్న గొడవలు జరుగుతుండేవి.

పొలం కావాలని నమ్మించి..
కొందరు గుర్తు తెలియని వ్యక్తులు జూన్ 17న తేజేశ్వర్‌‌‌‌కు ఫోన్‌‌‌‌ చేసి.. తమకు కొంత పొలం కావాలని, మంచి కమిషన్‌‌‌‌ ఇస్తామని నమ్మించారు. దీంతో వారు వచ్చిన కారులోనే తేజేశ్వర్‌‌‌‌ బయటకు వెళ్లాడు. సాయంత్రమైనా తేజేశ్వర్‌‌‌‌ ఇంటికి రాకపోవడంతో అతడి తల్లిదండ్రులు పెద్ద కొడుకు తేజవర్ధన్‌‌‌‌ దృష్టికి తీసుకెళ్లారు. అతడు 17వ తేదీనే గద్వాల పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్‌‌‌‌ కేసు నమోదు చేసి ఎంక్వైరీ మొదలు పెట్టారు.

ప్లాన్‌‌‌‌ ప్రకారమే కిడ్నాప్‌‌‌‌, మర్డర్‌‌‌‌
విచారణలో భాగంగా పోలీసులు తేజేశ్వర్‌‌‌‌ భార్య ఐశ్వర్య కాల్‌‌‌‌డేటాను పరిశీలించారు. ఇందులో ఆమె తన మాజీప్రియుడు తిర్మలరావుకు సుమారు రెండు వేల సార్లు ఫోన్‌‌‌‌ చేసినట్లు గుర్తించారు. దీంతో అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. పొలం కావాలని చెప్పి తేజేశ్వర్‌‌‌‌ను బయటకు తీసుకెళ్లిన వ్యక్తులు పూడూరు, అనంతపురం, ఎర్రవల్లి, బీచుపల్లి తదితర ప్రాంతాల్లో పొలాలు చూశారు. 

ఈ క్రమంలో ఎర్రవల్లి చౌరస్తాకు రాగానే తేజేశ్వర్‌‌‌‌ ఫోన్‌‌‌‌ లాక్కొని స్విచ్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ చేయడంతో పాటు అతడిని కిడ్నాప్‌‌‌‌ చేసి ఏపీలోని పాణ్యంకు తీసుకెళ్లారు. అక్కడి సుగాలిమెట్టు ప్రాంతంలో తేజేశ్వర్‌‌‌‌ను హత్య చేసి డెడ్‌‌‌‌బాడీని పిన్నాపురం చెరువులో పడేసినట్లు నిందితులు చెప్పారు. దీంతో చెరువులోంచి డెడ్‌‌‌‌బాడీని బయటకు తీసి కర్నూల్‌‌‌‌లో పోస్ట్‌‌‌‌మార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. ఈ హత్య కేసులో ఐశ్వర్య, ఆమె తల్లి సుజాత, మాజీ ప్రియుడు తిరుమలరావుతో పాటు ఓ బ్యాంక్‌‌‌‌ ఉద్యోగి ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది.