శేరిలింగంపల్లి జోన్‭లో​టౌన్ ​ప్లానింగ్ ఆఫీసర్ల కొరత

 శేరిలింగంపల్లి జోన్‭లో​టౌన్ ​ప్లానింగ్ ఆఫీసర్ల కొరత

గచ్చిబౌలి, వెలుగు: జీహెచ్ఎంసీ శేరిలింగంపల్లి జోన్​పరిధి వివిధ సర్కిళ్లలోని ​టౌన్​ ప్లానింగ్ ​వింగ్​లో అధికారుల కొరత తీవ్రంగా ఉంది. సరిపడా ఆఫీసర్లు, సిబ్బంది లేక  గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పర్యవేక్షణ లేక అక్రమ నిర్మాణాలు పుట్టుకొస్తున్నాయి. పటాన్​చెరు, చందానగర్ ​సర్కిళ్లలో ఏడు డివిజన్లు ఉంటే ఒకే ఒక్క టౌన్ ప్లానింగ్​సూపర్​వైజర్(టీపీఎస్)​ఉన్నాడు. శేరిలింగంపల్లి సర్కిల్​లో మూడు డివిజన్లకు గాను ఇద్దరు మాత్రమే టీపీఎస్​అధికారులు పనిచేస్తున్నారు. చందానగర్, పటాన్​చెరు సర్కిళ్లలోని ఏడు డివిజన్లకు ఒకే ఒక్క టీపీఎస్ ​అధికారి ఉన్నారు. ప్రమోషన్లు, ట్రాన్సఫర్​పై వెళ్లిన అధికారుల స్థానంలో కొత్తవారిని నియమించకుండా ఉన్న వారికే అదనపు బాధ్యతలు ఇస్తుండటంతో వారిపై పనిభారం పడుతోంది. అధికారులు, సిబ్బంది కొరత కారణంగా పర్యవేక్షణ లేక ఈ మూడు సర్కిళ్ల పరిధిలో విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు సాగుతున్నాయి. 

రెవెన్యూ డివిజన్​లో ఎక్కువగా..

శేరిలింగంపల్లి జోన్​లో చందానగర్, శేరిలింగంపల్లి, పటాన్​చెరు, రామచంద్రాపురం, యూసుఫ్​గూడ సర్కిళ్లు ఉన్నాయి. చందానగర్​సర్కిల్​లో మాదాపూర్, హఫీజ్​పేట్, మియాపూర్, చందానగర్​ డివిజన్లు ఉండగా.. ఈ నాలుగింటికి కలిపి ఒకే ఒక్క టీపీఎస్ అధికారి విధులు నిర్వహిస్తున్నారు. 4 డివిజన్లకు నలుగురు చైన్​మెన్లు ఉండాలి. కానీ ఇద్దరు మాత్రమే ఉన్నారు. శేరిలింగంపల్లి సర్కిల్​లో శేరిలింగంపల్లి, కొండాపూర్, గచ్చిబౌలి డివిజన్లతో పాటు భారతీనగర్ డివిజన్​ కొంత భాగం ఉంది. 

సర్కిల్ ​టౌన్ ​ప్లానింగ్​లో మూడు డివిజన్లకు గాను ముగ్గురు టీపీఎస్ అధికారులకు బదులు ఇద్దరు ఉన్నారు. ముగ్గురు చైన్​మెన్లు ఉండాల్సిన చోట ఒక్కరు మాత్రమే ఉన్నారు. ఇదిలా ఉంటే.. ఈ సర్కిల్​లోని రెవెన్యూ డివిజన్​లో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. సీనియర్, జూనియర్​అసిస్టెంట్లు ఉండాల్సిన వారి కన్నా ఎక్కువ ఉన్నారు. సీనియర్ ​అసిస్టెంట్లను టీపీఎస్​అధికారులుగా, జూనియర్ అసిస్టెంట్లను చైన్​మెన్లుగా నియమించే అధికారం జోనల్​ కమిషనర్​కు ఉన్నప్పటికీ నియమించకుండా ఉన్న వారితోనే డ్యూటీ చేయిస్తున్నారు. పటాన్​చెరు, రామచంద్రాపురం సర్కిల్​లో ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. రెవెన్యూ సహా కొన్ని విభాగాల్లో అదనపు అధికారులు, సిబ్బంది ఉన్నా సరే వారిని టౌన్​ప్లానింగ్ సెక్షన్​కు ట్రాన్స్​ఫర్​ చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

ఇష్టమొచ్చినట్లు నిర్మాణాలు

శేరిలింగంపల్లి జోన్​లోని చందానగర్, శేరిలింగంపల్లి, పటాన్​చెరు సర్కిళ్ల టౌన్​ప్లానింగ్​విభాగంలో అధికారులు, సిబ్బంది తక్కువ సంఖ్యలో ఉండటం, ఉన్న వారికి అదనపు బాధ్యతలు అప్పగించడంతో మూడు సర్కిళ్లలో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. అదనపు బాధ్యతల కారణంగా ఫీల్డ్​ విజిట్​ చేయకపోవడంతో ఐటీ కారిడార్​ ఉన్న శేరిలింగంపల్లి సర్కిల్​లో అక్రమ నిర్మాణాలు భారీగా వెలుస్తున్నాయి. పటాన్​చెరు, చందానగర్​ సర్కిళ్లలోనూ ఇదే పరిస్థితి ఉంది. ఇంత జరుగుతున్నా జోనల్​ కమిషనర్​మాత్రం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. మూడు సర్కిళ్ల టౌన్ ​ప్లానింగ్ ​విభాగాల్లో అధికారులు, సిబ్బందిని నియమించకపోవడంతో సరైన పర్యవేక్షణ లేకనే అక్రమ నిర్మాణాలు విచ్చలవిడిగా సాగుతున్నాయనే అరోపణలు వస్తున్నాయి.