- సాఫ్ట్వేర్ రూపొందించాలని మంత్రి హరీశ్ ఆదేశం
హైదరాబాద్, వెలుగు: ఆరోగ్యశాఖలో హౌస్ సర్జన్లు, జూనియర్ డాక్టర్లు, సీనియర్ రెసిడెంట్డాక్టర్ల స్టైపండ్, డైట్, పారిశుద్ధ్య విభాగాల్లో పనిచేసే సిబ్బంది, ఇతర కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది వేతనాలు, నర్సుల వేతనాల చెల్లింపుల కోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించాలని అధికారులను మంత్రి హరీశ్రావు ఆదేశించారు. మాన్యువల్ విధానం వల్ల స్టైపండ్, వేతనాల చెల్లింపు ఆలస్యం అవుతోందని, ఆన్లైన్ విధానం అందుబాటులోకి తెచ్చి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని మంత్రి సూచించారు. నేరుగా ఆయా వ్యక్తుల బ్యాంకు ఖాతాలో డబ్బులు జమయ్యేలా కొత్త విధానం ఉండాలన్నారు. ఈ మేరకు గురువారం బీఆర్కే భవన్లో ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షించారు.
కనిపించే దేవుళ్లు డాక్టర్లు
డాక్టర్ల డే (శుక్రవారం) సందర్భంగా రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు డాక్టర్లందరికీ హరీశ్ ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. ఈ భూమిపై ప్రజల ప్రాణాలను కాపాడగలిగే శక్తి డాక్టర్లకు మాత్రమే ఉందని, అందుకే వాళ్లు కనిపించే దేవుళ్లు అని ప్రశంసించారు.
రేపటి నుంచి ఎమర్జెన్సీ సేవలు బంద్
తమ స్టైపండ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ గురువారం రాష్ట్రంలోని 29 హాస్పిటళ్లలో డాక్టర్లు విధులు బహిష్కరించి, నిరసన కొనసాగించారు. శుక్రవారం నుంచి ఎమర్జెన్సీ సర్వీసులనూ బహిష్కరిస్తామని హెచ్చరించారు.