ప్రస్తుతం హవా అంతా సోషల్ మీడియాదే. దాన్నుంచి ఫేమస్ అయినోళ్లు చాలామంది. అలానే తన టాలెంట్ను సోషల్ మీడియా ద్వారా పదిమందికి చూపిస్తున్నాడు సాయి మనోజ్ ముచ్చుపల్లి. సొంతంగా కీ బోర్డ్ ప్లే చేయడం నేర్చుకుని, కవర్ సాంగ్స్ పాడుతున్నాడు. తల్లితో కలిసి పాటలు పాడుతూ మ్యూజిక్ లవర్స్ని మెస్మరైజ్ చేస్తున్నాడు. ప్రతి ఒకరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. కొన్ని పరిస్థితులు దృష్ట్యా, కొన్ని కారణాల వల్ల చాలామంది టాలెంట్ బయటికి రాదు. కానీ, సాయి మనోజ్ అలా అనుకోలేదు. తల్లిలో ఉన్న టాలెంట్ను అందరికీ చెప్పాలనుకున్నాడు. ఆమెతో పాటలు పాడించి సోషల్మీడియాలో పెట్టి ఫేమస్ చేస్తున్నాడు. శ్రీకాకుళం జిల్లా రెడ్డిపేటకు చెందిన సాయి మనోజ్ ముచ్చుపల్లి కూడా పాటలు బాగా పాడతాడు. ‘ఎవరో రావాలి. ఏదో జరగాలి’ అని అనుకోకుండా తన టాలెంట్ను పదిమందికి తెలిసేలా సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నాడు. కీ బోర్డ్ ప్లే చేస్తూ కవర్ సాంగ్స్ చేస్తూ మ్యూజిక్ లవర్స్ను మెస్మరైజ్ చేస్తున్నాడు.
పాలిటెక్నిక్ పూర్తిచేసి ప్రస్తుతం ఇంజినీరింగ్ రెండో ఏడాది చదువుతున్న సాయి మనోజ్కి పాటలు పాడటం అంటే చాలా ఇష్టం. అందుకే, చదువుకుంటూనే సంగీతంలో డిప్లొమా పూర్తి చేశాడు. తాత, మామ, నాన్న అందరూ పాటలు పాడతారు. వాళ్ల దగ్గర సంగీతంలో శిక్షణ తీసుకున్న సాయి సొంతంగా కీ బోర్డ్ ప్లే చేయడం నేర్చుకున్నాడు. ఇప్పుడు గిటార్లో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. పదమూడేండ్ల వయసులోనే ‘బోల్ బేబీ బోల్’ సీజన్ – 5లో పాల్గొని ఫైనలిస్ట్ అయ్యాడు. “ హేమచంద్ర అంత సింగర్ అవుతావు. నీలో ఆ టాలెంట్ ఉంది” అని జడ్జిలు మెచ్చుకునేలా పర్ఫామెన్స్ ఇచ్చాడు. చదువుకుంటూనే షోస్లో పార్టిసిపేట్ చేస్తూ, పాటలు పాడుతూ పేరు తెచ్చుకుంటున్నాడు. ఎప్పటికైనా సంగీత ప్రపంచంలో మంచి పేరు తెచ్చుకోవాలని, దాని కోసం ప్రయత్నాలు చేస్తున్నానని అంటున్నాడు సాయి మనోజ్. “ అమ్మ గొంతు బాగుంటుంది. పాటలు పాడుతుందని తెలుసు. అందుకే, ఒకరోజు అమ్మతో కలిసి ఎలాగైనా పాడించాలనుకున్నా. ఇద్దరం కలిసి పాడిన పాటను ఫేస్బుక్లో పోస్ట్ చేశా. దానికి చాలా రెస్పాన్స్ వచ్చింది. అంతమంది కనెక్ట్ అవుతారని అస్సలు అనుకోలేదు. ఫ్యూచర్లో కచ్చితంగా అమ్మతో కలిసి ఇంకొన్ని కవర్ సాంగ్స్ చేస్తా” అన్నాడు సాయి మనోజ్.