
అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న నాలుగో టెస్టు మ్యాచ్లో సెంచరీ చేసిన టీమిండియా స్టార్ ఓపెనర్ శుభమన్ గిల్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఒక ఏడాదిలో అన్ని ఫార్మట్ లలో సెంచరీ చేసిన పదో ఆటగాడిగా, భారత్ నుంచి నాలుగో ఆటగాడిగా నిలిచాడు. ఈ ఏడాది ఈ ఫీట్ సాధించిన తొలి క్రికెటర్గా గిల్ నిలిచాడు. జనవరిలో న్యూజిలాండ్పై వన్డేల్లో డబుల్ సెంచరీతో చెలరేగిన గిల్.. ఫిబ్రవరిలో తన తొలి టీ20 సెంచరీని సాధించాడు. ఇప్పుడు ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు మ్యాచ్లో సెంచరీ కొట్టాడు.
ఒక ఏడాదిలో అన్ని ఫార్మాట్లలో సెంచరీ చేసిన నాలుగో భారతీయుడిగా గిల్ నిలిచాడు. గతంలో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సురేశ్ రైనా ఈ ఘనత సాధించారు. ఇక విదేశీ ఆటగాళ్లలో మహేల జయవర్ధనే (2010), తిలకరత్నే దిల్షాన్ (2011), అహ్మద్ షెహజాద్ (2014), తమీమ్ ఇక్బాల్ (2016), డేవిడ్ వార్నర్ (2019), బాబర్ ఆజం (2022) కూడా ఈ ఫిట్ సాధించారు. ఇక ఈ మ్యాచ్లో సెంచరీతో ఆకట్టుకున్న గిల్ మరో రికార్డు కూడా నెలకొల్పాడు. మరోవైపు ఆస్ట్రేలియాపై సెంచరీ చేసిన రెండో అతి చిన్న ఇండియన్ ఓపెనర్గా రికార్డు సృష్టించాడు. 23 ఏళ్ల శుబ్మన్ కంటే ముందు కేఎల్ రాహుల్ 2015లో సిడ్నీ వేదికగా టెస్టుల్లో శతకం సాధించాడు.