- ఉమ్మడి ఏపీలో మావోయిస్టుల ఏరివేత కోసం ఏర్పాటు చేసిన వింగ్
- ప్రత్యేక రాష్ట్రంలో తనకు అనుకూలంగా మలుచుకున్న గులాబీ బాస్!
- స్పెషల్ ఆపరేషన్ టార్గెట్స్(ఎస్ఓటీ) పేరుతో మరో వింగ్
- చట్టబద్ధత లేని ఈ ఎస్ఓటీకి చీఫ్గా ప్రణీత్రావు
- ప్రైవేట్ వ్యక్తుల ఫండింగ్తో ట్యాపింగ్.. మహిళలనూ వదలకుండా వేధింపులు
- అరాచకాలు బయటపడకుండా హార్డ్ డిస్క్లు ధ్వంసం
- ఏండ్ల తరబడి సేకరించిన మావోయిస్టుల సీక్రెట్ డేటా కూడా మాయం
హైదరాబాద్, వెలుగు: మావోయిస్టుల కట్టడి కోసం ఏర్పాటు చేసిన ఎస్ఐబీ (స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్)ను గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రైవేటు ఏజెన్సీగా మార్చేసింది. అందులో పనిచేసే అధికారులను తమ సొంత అవసరాల కోసం ప్రైవేటు సైన్యంగా వాడుకున్నది. రాజకీయ ప్రత్యర్థులు, గిట్టని వాళ్లపై నిఘా వేసే సొంత దుకాణంగా మలుచుకున్నది.
నాటి ప్రభుత్వ అధినేత కనుసన్నల్లోనే ఇదంతా జరిగినట్టు ఫోన్ ట్యాపింగ్ విచారణలో బట్టబయలవుతున్నది. ఎస్ఐబీలో స్పెషల్ ఆపరేషన్స్ టార్గెట్ (ఎస్ఓటీ) పేరుతో ఒక చట్టబద్ధతలేని వింగ్ ను ఏర్పాటు చేశారు. దీనికి ప్రణీత్రావును చీఫ్గా నియమించారు. అతని ద్వారా ఇల్లీగల్ ఆపరేషన్స్ చేయించారు.
సిటీ టాస్క్ఫోర్స్,స్పెషల్ ఆపరేషన్ టీమ్స్ తరహాలోనే ఈ వింగ్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా అనధికారిక కార్యకలాపాలు నిర్వహించారు. పొలిటికల్ లీడర్స్, పోలీస్ ఉన్నతాధికారులు, ప్రైవేట్ వ్యక్తులు, చివరకు మహిళలను కూడా టార్గెట్ చేసి, వాళ్ల ఫోన్లను ట్యాప్ చేశారు. వేధింపులు, బ్లాక్మెయిలింగ్తో సొంత ప్రయోజనాలు పొందారు. తమ అరాచకాల గుట్టు బయటపడకుండా ఎస్ఐబీ హార్డ్డిస్క్లను ధ్వంసం చేశారు. దీంతో ఏండ్ల తరబడి ఇంటెలిజెన్స్ వింగ్స్ సేకరించిన మావోయిస్టుల సీక్రెట్ డేటా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కోల్పోవాల్సి వచ్చింది.
పొలిటికల్ టార్గెట్స్గా మారిన ఎస్ఐబీ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టుల అణచివేతకు ఐపీఎస్ అధికారి దివంగత కోట శ్రీనివాస్ వ్యాస్ (కేఎస్ వ్యాస్) ప్రత్యేక ఇంటెలిజెన్స్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. మావోయిస్టుల సమాచారాన్ని సేకరించేందుకు 1989లో ఇంటెలిజెన్స్ బ్యూరో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్, గ్రేహౌండ్స్ను రూపొందించారు.ఈ రెండు విభాగాలను కేవలం మావోయిస్టుల కదలికలను పసిగట్టి ఆపరేషన్స్ చేసేందుకు మాత్రమే వినియోగించారు.ఈ వ్యవస్థ ఉమ్మడి రాష్ట్రంలో కూడా మంచి ఫలితాలను సాధించింది.
అయితే, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎస్ఐబీ రూపురేఖలు మారిపోయాయి. ప్రతిపక్ష నేతలే టార్గెట్గా ఎస్ఐబీ ఆపరేషన్స్ నిర్వహించారు. మావోయిస్టుల కదలికలపై కాకుండా కేవలం అధికార పార్టీకి వ్యతిరేకంగా పనిచేసేవారినే టార్గెట్ చేశారు. ఇందులో భాగంగానే ‘స్పెషల్ ఇంటెలిజెన్స్ టార్గెట్స్’ పేరుతో ప్రత్యేక టీమ్ను తయారు చేశారు. ప్రణీత్రావు చీఫ్గా రెండు లాగర్ రూమ్స్ను ఏర్పాటు చేశారు.
అక్కడి నుంచే ప్రైవేట్ఆపరేషన్స్ నిర్వహించారు. ప్రభుత్వ నిధులు ఖర్చు చేస్తే అధికారికంగా జీవో విడుదల చేయాల్సి వస్తుందనే కారణంతోఎస్ఓటీ ఆపరేషన్స్, స్పెషల్ ఆపరేషన్స్ టార్గెట్ టీమ్ కోసం ప్రైవేట్ వ్యక్తుల నుంచి ఫండింగ్ పొందినట్టు సమాచారం. ప్రైవేట్ వ్యక్తులు, పొలిటికల్ లీడర్ల ఫోన్ ట్యాపింగ్ అనేది నేరం కావడంతో ఎలాంటి ఆధారాలు లభించకుండా ప్రైవేట్ సంస్థల నుంచి ట్యాపింగ్ టూల్స్, సాఫ్ట్వేర్ కొనుగోలు చేశారు. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని ‘కన్వర్జెన్స్ ఇన్నోవేషన్ ల్యాబ్’ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి స్పెషల్ ఆపరేషన్స్ టార్గెట్స్కు అవసరమైన ప్రత్యేక సాఫ్ట్వేర్ టూల్స్ కొనుగోలు చేశారు. వీటికి రూ.కోట్లు ఖర్చు చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఇందుకోసం ఓ రాజ్యసభ సభ్యుడు, ఎమ్మెల్సీ ఫండింగ్ చేసినట్టు తెలిసింది.
అడ్డూ అదుపు లేకుండా అరాచకాలు
పొలిటికల్ టార్గెట్స్ ఆపరేషన్స్ కోసం అప్పటి ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావుకు నమ్మకమైన ప్రణీత్రావును ఎస్ఓటీ చీఫ్గా నియమించారు. 30 మందితో కూడిన ఎస్ఓటీ టీమ్ ఫోన్ట్యాపింగ్తో పాటు జిల్లాల్లోని వార్ రూమ్స్లో పనిచేసింది. గత ప్రభుత్వం టార్గెట్ చేసిన ప్రతిపక్షనేతలు, సొంత పార్టీలో అనుమానిత ఎమ్మెల్యేలు, వ్యాపార ప్రముఖులపై నిఘా పెట్టేవారు. ఎస్ఐబీ సిబ్బంది అందించే వ్యక్తిగత డేటా, కుటుంబ సభ్యులు, అనుచరుల ప్రొఫైల్స్ తయారు చేసేవారు.
ఇలా ప్రభుత్వ పెద్దలు సూచించిన పొలిటికల్ లీడర్ల ఫోన్ నంబర్స్తో పాటు వందల సంఖ్యలో ప్రైవేట్ వ్యక్తుల ఫోన్లను ట్యాప్ చేశారు. ఇందులో ప్రణీత్రావుతో కలిసి పనిచేసిన కానిస్టేబుల్ స్థాయి అధికారి నుంచి ఎస్పీ స్థాయి అధికారి వరకు అక్రమాలకు పాల్పడినట్టు దర్యాప్తులో బయటపడుతున్నది. ట్యాపింగ్ ద్వారా రికార్డు చేసిన ఆడియోలతో పలువురిని బ్లాక్మెయిల్ చేసినట్టు కూడా సమాచారం. ఈ మేరకు బాధితుల నుంచి అందిన ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కుప్పకూలిన ఎస్ఐబీ డేటా!
స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్, ఎస్ఓటీ అడ్డాగా రహస్య డేటాను ధ్వంసం చేయడంలో ప్రణీత్రావు కుట్రపూరితంగా వ్యవహరించాడు. గత ప్రభుత్వ హయాంలో చేసిన ఫోన్ట్యాపింగ్ వివరాలు బయటపడకుండా పథకం వేశాడు. ఎస్ఐబీలో తన రెండు లాగర్ రూమ్స్లో ఉన్న17 కంప్యూటర్ల నుంచి హార్డ్డిస్క్లను తీసి కట్టర్స్తో కట్ చేశాడు. ఆధారాలు లభించకుండా నాగోల్సమీప మూసీనీటిలో పడేశాడు. కాగా, ప్రణీత్రావు ధ్వంసం చేసిన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ డేటా తిరిగి రిట్రీవ్ చేసే అవకాశాలు లేవని టెక్నికల్ నిపుణులు తేల్చిచెప్పినట్టు తెలిసింది.
17 కంప్యూటర్లకు చెందిన 42 హార్డ్డిస్క్లలోని సీక్రెట్ డేటా ఇక తిరిగి పొందే చాన్స్ లేదని చెప్పినట్టు సమాచారం. దీంతో ఏండ్ల తరబడి ఇంటెలిజెన్స్, ఎస్ఐబీ సేకరించిన మావోయిస్టులు, ఇతర టెర్రరిస్టుల సమాచారాన్ని రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ కోల్పోయినట్టు తెలిసింది. హార్డ్డిస్క్లను కట్టర్స్తో కట్ చేయడంతో పాటు మూసీనీటిలో పడేయడంతో డేటా పూర్తిగా ధ్వంసమైనట్టు సైబర్ ఎక్స్పర్ట్స్ గుర్తించారు. దీంతో రెండు టెలికం కంపెనీలకు చెందిన సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా సమాచారం సేకరించేందుకు పోలీసులు కోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు అనుమతితో ఆయా సర్వర్లలో నిక్షిప్తం అయిన డేటాను తిరిగి సంపాదించేందుకు చర్యలు చేపట్టారు.