
బెంగుళూరు: కర్నాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మరోసారి కుల గణన సర్వే నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు కర్నాటక సీఎం సిద్ధరామయ్య శుక్రవారం (సెప్టెంబర్ 12) కీలక ప్రకటన చేశారు. 2015 కుల గణన నివేదికను ప్రభుత్వం ఆమోదించలేదన్న సిద్ధరామయ్య.. 2025, సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 7 వరకు కర్ణాటక అంతటా కొత్త సామాజిక-ఆర్థిక, విద్యా సర్వే (కుల గణన) నిర్వహిస్తామని ప్రకటించారు. గత కుల గణన సర్వే జరిగి 10 సంవత్సరాలు గడిచిపోవడంతో మారిన ప్రస్తుత జనాభా లెక్కలు తెలుసుకోవడానికి ఈ సర్వే నిర్వహిస్తున్నామని చెప్పారు.
స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడిచినా సమాజంలో ఇంకా అసమానతలు కొనసాగుతున్నాయని.. మన ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ఈ అసమానతలను తొలగించాలి. ఈ సర్వే ప్రతి ఒక్కరికీ సమర్థవంతమైన సంక్షేమ కార్యక్రమాలను రూపొందించడానికి అవసరమైన డేటాను అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజ్యాంగం అందరూ సమానంగా ఉండాలని.. సామాజిక న్యాయం జరగాలని చెబుతోందని ఇందులో భాగంగానే రాష్ట్రంలో కుల గణన సర్వే చేపడుతున్నామని తెలిపారు.
సమాజంలో అసమానతలను తొలగించి ప్రజాస్వామ్యానికి బలమైన పునాదులను సృష్టించే దిశగా ఈ సర్వే ఒక కీలకమైన ముందడుగు అని సీఎం సిద్ధరామయ్య ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రతిపౌరుడు కుల గణన సర్వేలో పాల్గొని అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సర్వేకు ముందుగానే ఆశా కార్యకర్తలు దరఖాస్తు ఫారమ్ను అందించడానికి మీ ఇంటికి వస్తారని తెలిపారు.
కొత్త కుల గణన సర్వే వివరాలు:
కర్ణాటక రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ నిర్వహించనున్న ఈ సర్వే రాష్ట్రంలోని దాదాపు 7 కోట్ల జనాభాను, రెండు కోట్ల కుటుంబాల వివరాలను సేకరించనుంది. మధుసూదన్ నాయక్ అధ్యక్షతన ఏర్పాటైన కమిషన్ 2025, సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 7 వరకు రాష్ట్రవ్యాప్తంగా కుల గణన సర్వే నిర్వహించనుంది. సర్వే తుది నివేదికను 2025 డిసెంబర్ నాటికి కమిషన్ ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది. సర్వేలో భాగంగా ప్రతి ఇంటికి ఒక ప్రత్యేక గృహ గుర్తింపు స్టిక్కర్ ఇవ్వబడుతుంది.
కుటుంబాల సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యా స్థితిగతుల వివరాలను తెలుసుకోవడానికి దాదాపు 60 ప్రశ్నల సమాధానాలు తెలుసుకోనున్నారు అధికారులు. ఈ సర్వే నిర్వహించడం కోసం 1.85 లక్షల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి విధుల్లోకి తీసుకోనుంది ప్రభుత్వం. సర్వే నిర్వహించే ఉపాధ్యాయులకు రూ. 20,000 వరకు గౌరవ వేతనం ఇవ్వనుంది ప్రభుత్వం. దసరా సెలవుల్లో సర్వే నిర్వహించనున్నారు.
ALSO READ : కాంగ్రెస్ కామారెడ్డి సభ వాయిదా..ఎందుకంటే.?
ప్రతి ఇంటికి విద్యుత్ మీటర్ నంబర్లతో జియో-ట్యాగ్ చేయడంతో పాటు రేషన్ కార్డులు, ఆధార్ వివరాలు మొబైల్ నంబర్లకు అనుసంధానించనున్నారు. గణనదారులకు కుల వివరాలను వెల్లడించడానికి ఇష్టం లేని ఆన్లైన్ వివరాలు సమర్పించవచ్చు. ప్రత్యేక హెల్ప్లైన్ (8050770004) కు చేసి వివరాలు అందివచ్చు. కుల గణన సర్వే మొత్తం ప్రక్రియ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 420 కోట్లు కేటాయించింది.