
కామారెడ్డిలో సెప్టెంబర్ 15న జరగనున్న సభను వాయిదా వేసింది టీ పీసీసీ. భారీ వర్షాల సూచనతో సభను వాయిదా వేసినట్లు తెలిపింది. సభ తిరిగి ఎపుడు నిర్వహిస్తామనేది త్వరలో చెబుతామని ప్రకటించింది.
బీసీ డిక్లరేషన్ ప్రకటించిన కామారెడ్డి గడ్డ మీద నుంచే రిజర్వేషన్లకు అడ్డుగా ఉన్న బీజేపీ సర్కారు మీద సమర శంఖం పూరించేందుకు కాంగ్రెస్ సిద్ధమైన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 15న కామారెడ్డిలో భారీ బహిరంగసభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. భారీ సభ నిర్వహించడం బీజేపీ మీద ఒత్తిడి తీసుకురావాలని కాంగ్రెస్ నాయకత్వం సన్నాహాలు చేస్తోంది.
కామారెడ్డి సభకు కనీసం 2 లక్షల మందిని సమీకరించాలని పార్టీ నాయకులు టార్గెట్గా పెట్టుకున్నారు. కామారెడ్డి, నిజామాబాద్, రాజన్న సిరిసిల్లా జిల్లాల నుంచి ప్రధానంగా జనాన్ని తరలించాలని భావిస్తున్నారు. ఈ జిల్లాలకు చెందిన ముఖ్య నాయకులతో పీసీసీ లీడర్లు జనాలను తరలించే విషయంలో చర్చిస్తున్నారు. కామారెడ్డికి దగ్గరగా ఉండే మండలాలపై ఫోకస్ పెట్టాలని సూచిస్తున్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రానుండడంతో గ్రామ, మండలస్థాయి లీడర్లు కూడా ఉత్సాహం పనిచేసే అవకాశం ఉందని ఆశిస్తున్నారు. ఈ సభకు కాంగ్రెస్ జాతీయ స్థాయి నాయకులు హాజరు కావచ్చునని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే సభ నిర్వహణ, జన సమీకరణ తదితర అంశాలను పరిశీలించేందుకు ఆదివారం కామారెడ్డిలో సన్నాహాక సమావేశం జరిగింది. సభ సక్సెస్చేసేందుకు ఎలా పని చేయాలో పార్టీ శ్రేణులకు పీసీసీ చీఫ్, మంత్రులు దిశానిర్దేశం చేశారు. అయితే తెలంగాణకు భారీ వర్షాల హెచ్చరికతో సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది టీపీసీసీ.