
పురాణాల ప్రకారం... చాతుర్మాస కాలంలో శ్రీ మహా విష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు. ఈ కాలంలో విష్ణుమూర్తిని తులసీ దళాలతో ప్రత్యేక పూజలు చేయడంతో పాటు దానధర్మాలు చేయాలని పండితులు చెబుతారు. ఈ ఏడాది (2025) కామిక ఏకాదశి ఎప్పుడొచ్చింది.. శుభ ముహుర్తం, పూజా విధానం ప్రాముఖ్యతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...
ప్రతి ఏకాదశికి ప్రత్యేక ప్రాముఖ్యత, ప్రయోజనం ఉంటుంది.విష్ణుమూర్తి అనుగ్రహం, దైవానుగ్రహం కోసం భక్తులు ఈ నిర్దిష్ట రోజులలో ఉపవాసం ఉంటారు.ఆషాఢమాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశి ( జులై21)ని కామికా ఏకాదశి అంటారు. ఈ పర్వదినాన శ్రీ లక్ష్మీనారాయణులకు ప్రత్యేక పూజలు చేయాలని పండితులు చెబుతున్నారు.
వేద పంచాంగం ప్రకారం ఏకాదశి తిథి జూలై 20న మధ్యాహ్నం 12:12 గంటలకు ప్రారంభమై జూలై 21న ఉదయం 9:38 గంటలకు ముగుస్తుంది. దీనితో కామిక ఏకాదశిని జూలై 21న జరుపుకోవాలని ఉందని చెబుతున్నారు. జూలై 22న ఉదయం 5:37 నుంచి 7:05 గంటల మధ్య తమ ఉపవాసాన్ని విరమించాలని పంండితులు అంటున్నారు
కామికా ఏకాదశి ( జులై21) నాడు ఉపవాసం ఉంటే పాపాలు నశించడమే కాకుండా... కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. ఆ రోజు విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల ముక్కోటి దేవతలను పూజించిన ఫలితాలొస్తాయని పండితులు చెబుతారు. అంతేకాదు లక్ష్మీనారాయణును పూజిస్తే పాప కర్మలు తొలగుతాయని పండితులు చెబుతున్నారు.
ALSO READ : ఆధ్యాత్మికం : మీకు డబ్బులు బాగా రావాలంటే లక్ష్మీదేవిని ఈ విధంగా పూజించాలి.. ఈ మంత్రం పఠించాలి.. ఈ నియమాలు పాటించాలి..?
కామిక ఏకాదశి చేయడం వల్ల అశ్వమేధ యాగానికి సమానమైన పుణ్యం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి. విష్ణువు పాదాలనుతాకడం వల్ల మంచిజరుగుతుంది.కామికా ఏకాదశి వ్రతాన్ని చేసే భక్తులు...ఓం నమో భగవతే వాసుదేవాయ నమ: అని జపిస్తూ ఉండాలి.
ఎలా పూజ చేయాలంటే..!
- కామికా ఏకాదశి రోజున సూర్యోదయం కంటే ముందు నిద్ర లేచి తలస్నానం చేయాలి.
- ఉతికిన బట్టలు వేసుకుని, ఇంట్లో పూజా గదిని శుభ్రమైన నీటితో శుభ్రం చేయాలి.
- ఒక ఎర్రని వస్త్రంపై బియ్యంపై విష్ణుమూర్తి ఫోటో లేదా విగ్రహాన్ని ప్రతిష్టించాలి.
- శ్రీహరికి పువ్వులు, తులసిదళాలను సమర్పించాలి.
- పంచామృతం... గంగాజలంతో స్వామివారికి అభిషేకం చేయాలి.
- స్వామికి పసుపు, చందనం, పసుపు రంగు పువ్వులు సమర్పించాలి.
- ఆవు నెయ్యితో దీపారాధన చేసి, కామికా ఏకాదశి వ్రతం కథ, మంత్రాలను చదవాలి.
- చివరగా హారతి ఇచ్చి పూజను ముగించాలి.
- ఈరోజంతా ఉపవాసం ఉండాలి. మరుసటిరోజు ఉపవాసాన్ని విరమించాలి.
- ద్వాదశి రోజు బ్రాహ్మణుడికి దక్షిణ.. స్వయంపాకం ఇవ్వాలి. ఆ తరువాతే ఉపవాస దీక్షను విరమించాలి.
కామిక ఏకాదశి రోజున శ్రీహరిని పూజించడం వల్ల పూర్వీకులు సంతోషిస్తారని, వారి అనుగ్రహం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. పూర్వీకుల ఆశీస్సులు పొందిన వ్యక్తి జీవితంలో సంపద, ఆనందం, శ్రేయస్సు కచ్చితంగా పొందుతారు. ఈ పవిత్రమైన రోజున పసుపు రంగు వస్తువులను దానం చేయడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. అందుకే ఈరోజున మీ సామర్థ్యం మేరకు దానధర్మాలు చేయాలి.