బ్యాంకాక్ : డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధు, వరల్డ్ చాంపియన్షిప్ బ్రాంజ్ మెడలిస్ట్, వరల్డ్ 9వ ర్యాంకర్ లక్ష్యసేన్.. ప్రతిష్టాత్మక థామస్, ఉబెర్ కప్ కోసం రెడీ అయ్యారు. ఆదివారం నుంచి జరిగే ఈ మెగా టోర్నీలో పతకాలే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు. థామస్ కప్లో ఇంతవరకు ఇండియన్ మెన్స్ టీమ్ ఒక్క పతకమూ గెలవలేదు. కనీసం ఒక్కసారి కూడా సెమీస్ వరకు వెళ్లలేదు. దీంతో సూపర్ ఫామ్లో ఉన్న లక్ష్య ఈసారి పతకం తెస్తాడని అందరూ ఆశిస్తున్నారు. దీనికితోడు బలమైన టీమ్ను ఈసారి బరిలోకి దించుతున్నారు. వరల్డ్ 11వ ర్యాంకర్ కిడాంబి శ్రీకాంత్, హెచ్.ఎస్. ప్రణయ్ (23వ ర్యాంకర్).. సింగిల్స్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. గ్రూప్–సిలో ఇండియాతో పాటు చైనీస్ తైపీ, కెనడా, జర్మనీ ఉన్నాయి. విమెన్స్కు సంబంధించిన ఉబెర్ కప్లో ఇండియాకు 2014, 2016లో బ్రాంజ్ మెడల్స్ లభించాయి. ఈసారి పతకం రంగు మార్చాలని సింధు లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఆకర్షి కశ్యప్, ఉన్నతి హుడాకు అనుభవం లేకపోవడం ఇండియాకు ప్రతికూలంగా మారింది. గ్రూప్–డిలో సౌత్ కొరియా, కెనడా, అమెరికాతో గట్టిపోటీ ఉంది. డబుల్స్లో సాత్విక్–చిరాగ్ షెట్టి, ఎం.ఆర్. అర్జున్–ధ్రువ్ కపిల, కృష్ణ ప్రసాద్–విష్ణువర్ధన్ బరిలోకి దిగుతున్నారు. విమెన్స్ డబుల్స్లో సిక్కి రెడ్డి, అశ్విని పొనప్ప, గాయత్రి గోపీచంద్.. గాయాలతో టోర్నీకి దూరమయ్యారు. దీంతో తానిషా క్రాస్టో, శ్రుతి మిశ్రా, సిమ్రాన్ సింగ్, రితికా థాకరే, ట్రిసా జోలీపైనే భారం పడనుంది.

