WazirX News: వజీర్ఎక్స్ క్రిప్టో సంస్థకు కోర్టులో చుక్కెదురు.. సందిగ్ధంలో ఇన్వెస్టర్లు

WazirX News: వజీర్ఎక్స్ క్రిప్టో సంస్థకు కోర్టులో చుక్కెదురు.. సందిగ్ధంలో ఇన్వెస్టర్లు

క్రిప్టో పెట్టుబడుల చరిత్రలో అతిపెద్ద విషాదం వజీర్ఎక్స్ ఎక్స్ఛేంజీలో పెట్టుబడిదారుల సొమ్ము తస్కరణకు గురికావటం. క్రిప్టో ఎక్స్ఛేంజ్ WazirX 230 మిలియన్ డాలర్ల హ్యాక్ తర్వాత వినియోగదారుల నిధులను తిరిగి ఇచ్చే పునర్నిర్మాణ ప్రణాళిక ఇప్పుడు సందిగ్ధంలో పడింది. ఎందుకంటే జూన్ 4న సింగపూర్ హైకోర్టు ఈ ప్రణాళికను తిరస్కరించినట్లు ఎక్స్ ఖాతాలో కంపెనీ వెల్లడించింది. ఎక్స్ఛేంజ్ తన మాతృ సంస్థను సింగపూర్ నుంచి పనామాకు మార్చి.. జెన్సుయ్ అనే కొత్త పేరుతో రీబ్రాండ్ చేసింది. సింగపూర్‌లోని క్రిప్టో ఎక్స్ఛేంజీలు లైసెన్స్ లేకుండా దేశం వెలుపల సేవలను అందిస్తున్నందుకు కొనసాగుతున్న అణిచివేతను నివారించడానికి ఇది జరిగిందని తెలుస్తోంది.

జూలై 2024లో కంపెనీ వాలెట్లపై సైబర్ దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో దాదాపు 45 శాతం క్రిప్టో ఆస్తులను కంపెనీ కోల్పోయింది. ప్రస్తుతం ఈ ఎక్స్ఛేంజీలో 33 శాతం మంది భారతీయ క్రిప్టో ఇన్వెస్టర్లకు పెట్టుబడులు ఉన్నాయని సమాచారం. 

 

క్రిప్టో పెట్టుబడి ఎక్స్ఛేంజీలు ఎల్లప్పుడూ ఇలాంటి దాడులను ఎదుర్కోవటానికి అత్యుత్తమ జవాబుదారీతనాన్ని ఫాలో అవ్వటం తప్పనిసరి అని క్రిప్టో ఫాట్ ఫారం జియోటస్ సీఈవో విక్రమ్ సుబ్బురాజ్ అభిప్రాయపడ్డారు. ఇలాంటి సందర్భాలు రాకుండా ఉండేందుకు రెగ్యులేటరీ ఫ్రేమ్ వర్క్ కఠినంగా రూపొందించాల్సిన అవసరం ఉందని, అలాగే ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు ఆడిట్ నిర్వహించటం అవసరమని పేర్కొన్నారు. 

ఇన్వెస్టర్లు క్రిప్టో ఎక్స్ఛేంజ్ ఎంపికలో ఏం గమనించాలంటే..
ఇలాంటి సమయంలో ఇన్వెస్టర్లు ఏదైనా ఎక్స్ఛేంజీ ద్వారా క్రిప్టో పెట్టుబడులు చేయటానికి ముందు వాటి సెక్యూరిటీ గురించి తెలుసుకోవటం ముఖ్యం. అలాగే ఎప్పటికప్పుడు వస్తున్న మార్పుల గురించి గమనిస్తూ ఉండాలి. ఎప్పుడైనా తమ డబ్బు కోల్పోయినట్లు గమనిస్తే దాని గురించి వెంటనే ఫిర్యాదు చేయటం ముఖ్యం. ఇది తదుపరి నష్టాలను తగ్గిస్తుంది. అలాగే క్రిప్టోల గురించి చర్చించుకునే డిజిటల్ గ్రూపుల్లో ఉంటూ ఎప్పటికప్పుడు వచ్చే సమాచారాన్ని గమనించుకోవాల్సిన బాధ్యత కూడా పెట్టుబడిదారులపై ఉంటుంది. ఇది భవిష్యత్తు నష్టాలను నివారించటంతో పాటు వారు ట్రేడింగ్ చేస్తున్న ఫ్రాట్ ఫారం సెక్యూరిటీ, రిలయబిలిటీపై అవగాహన కల్పిస్తుంది. క్రిప్టో ఎక్స్ఖేంజీలు సైతం పెట్టుబడిదారులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించటంతో పాటు వారి పెట్టుబడులకు భద్రతను పెంచుతూ నమ్మకాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది.